కొంప ముంచిన చీరల మోజు.. ఆన్ లైన్ లో ఓటీపి చెప్పిన మహిళ..! చీర చిరిగిపోయే మెస్సేజ్ లు ప్రత్యక్ష్యం..
హైదరాబాద్: సహజంగా మహిళలకు ఎంతిచ్చినా ఇంకొంచెం కావాలంటారు. అది వారి నైజం. అదే చీరల విషయానికి వచ్చే సరికి ఇక చెప్పాల్సిన అవసరం ఉండదు. చీరల షాపింగ్ కి వెళ్తే తక్కువలో తక్కువ నాలుగు గంటలకు గాని వారి ఎంపిక పూర్తి కాదంటే ఆశ్చర్యం వేయక మానదు. చీరల విషయంలో అంత ప్రత్యేకత కలిగి ఉంటారు మన తెలుగు మహిళలు. ఇక చీర కోసం అత్యాశకుపోయి అక్షరాలా లక్ష రూపాయలు ఒదిలించుకుంది ఓ మహిళ.
కూకట్పల్లికి చెందిన ఓ మహిళ ఆన్లైన్లో చీరలు కొందామని ఓ వెబ్సైట్లో ఎంపిక చేస్తోంది. ఉన్నట్టుండి ఆకర్షణీయమైన చీరలతో మరో వెబ్సైట్ లింక్ దర్శనమిచ్చింది. ఆమె దాంట్లో లాగిన్ అయింది. అందులో ఉన్న చీరలు ఆకర్శణీయంగా ఉండి తనను ఆకట్టుకోవడంతో కొన్ని ఎంపిక చేసింది. ఆర్డర్ చేయడానికి వెబ్సైట్లో సూచించిన విధంగా అకౌంట్, ఫోన్ నంబర్లు సహా ఇతర వివరాలు ఎంటర్ చేసింది. అంతే చీర చిరిగిపోయే మెస్సేజ్ లతో ఫోన్ దద్దరిల్లిపోయింది.ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. మేడమ్.. మీ ఆర్డర్ చేరింది.
మా వెబ్సైట్లో చీరలు కొనుగోలు చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పాడు. మీ మొబైల్ నంబర్కు మెసేజ్ పంపిస్తాం. అందులో ఉన్న అంకెలను చెబితే ఆర్డర్ ఓకే చేసుకుంటామని నమ్మించాడు. ఫోన్ మాట్లాడుతుండగానే ఆమెకు మెసేజ్ వచ్చింది. ఆలోచించకుండా వారు అడిగిన నంబర్ చెప్పింది. అంతే కొద్ది సేపట్లోనే తన ఖాతా నుంచి 40 వేల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్టు మెసేజ్ వచ్చింది. అది గమనించి షాకైంది ఆ మహిళ. అయితే ఆ మహిళకు సైబర్ క్రైంపై కొంచెం అవగాహన ఉండడంతో ఇది కచ్చితంగా సైబర్ నేరగాళ్ల పనిగా అనుమానించింది.
వెంటనే తన ఖాతా ఉన్న యాక్సిస్ బ్యాంక్కు వెళ్లింది. జరిగిన విషయం బ్యాంక్ అధికారులతో చెబుతుండగా మరో 60 వేల రూపాయలు బదిలీ అయినట్టు మెసేజ్ వచ్చింది. దాన్ని అధికారులకు చూపించింది. ఖాతాలోని సొమ్ము యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) ద్వారా బదిలీ అయినట్లు గుర్తించి ఆమె ఖాతాను బ్లాక్ చేశారు. దీంతో బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.