ఏ సర్వే ఐనా అదే తేలుస్తోంది.. అందుకే చేరికలపై కేసీఆర్ ఆసక్తి...
ఎంత చేసినా అంతంతేనా..? ఎన్ని ప్రజోపయోగ పథకాలకు శ్రీకారం చుట్టినా ఫలితం మాత్రం నామమాత్రమేనా..? ప్రజా సంక్షేమం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనా ధోరణిని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలం చెందారా..? తెలంగాణలో ఎమ్మెల్యేల తాజా పరిస్థితులపై గులాబీ బాస్ కి గుబులు రేగుతోందా..? విడతల వారీగా జరిపిన సర్వేలలో కూడా 40 మంది సిట్టంగ్ ల కన్నా ఎక్కువ మంది గెలవరనే అంశం స్పష్టమౌతోందా..? అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ విజన్ ని ప్రజల మద్యకు తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు విఫలం..
తెలంగాణలో 119 నియోజక వర్గాల్లో గులాబీ దళానికి ఎందురీత తప్పేలా కనిపించడం లేదు. పైకి వంద సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికి ప్రజాక్షేత్రంలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్దంగా ఉన్నట్లు నివేదికలు చెప్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన తరహాలో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. దేశానికే ఆదర్శవంతమైన పథకాలు ప్రవేశపెడుతున్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలం చెందారని నివేదికలు వెళ్లడించాయి.
ఈ నేపథ్యంలో సిట్టంగ్ ఎమ్మెల్యేలను నమ్ముకుంటే పుట్టిమునగడం ఖాయమని కేసీఆర్ కు గట్టి సంకేతాలు అందుతున్నాయి. దీంతో ముందస్తు జాగ్రత్తగా వ్యవహరించబోతున్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాదించడమే కాకుండా అభివ్రుద్ది పథంలో నడిపిస్తున్న టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో వ్యతిరేకత వ్యక్తం ఐతే ప్రజల్లో నెగటీవ్ అభిప్రాయాలు ఉద్బవిస్తాయని భావిస్తున్నారు.
సిట్టింగ్ ఎమ్మెల్యేలను నమ్ముకుంటే పుట్టిమునగడం ఖాయమని భావిస్తున్న కేసీఆర్..
అలాంటి ప్రతికూల పరిస్థితులను అదిగమించేందుకు వచ్చే ఎన్నికల్లో దాదాపు గెలుపుగుర్రాలను రంగంలోకి దింపాలని ప్రణాళిక రచిస్తోంది గులాబీ పార్టీ. అందులో భాగంగా ఇతర పార్టీలనుండి ఏ స్థాయి నాయకులనైనా తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది టీఆర్ఎస్. స్థానికంగా బలంగా ఉన్న ఏ పార్టీ నాయకులైనా తమ పార్టీలో చేరొచ్చనే సంకేతాలను టీఆర్ఎస్ పార్టీ పంపిస్తోంది. తెలుగుదేశం, కాంగ్రేస్, బీజెపీ నుండి ప్రజాబలం ఉండి సొంత పార్టీలో ఇమడలేని నాయకులను కూడా ఆహ్వానిస్తోంది గులాబీ పార్టీ. అంతే కాకుండా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ లోని 14 నియోజకవర్గాల మీద గులాబీ పార్టీ కన్నేసింది. గ్ర్రేటర్ లో గెలిచే అభ్యర్థులను పార్టీలో చేర్చుకుని సత్తాచాటాలని కూడా వ్యూహం రచిస్తోంది టీఆర్ఎస్.
ఇతర పార్టీలోని బలమైన నేతలకు గాలం వేస్తున్న గులాబీ పార్టీ..
కాంగ్రెస్ పార్టీకి సిటీలో ఆయువు పట్టుగా ఉన్న దానం నాగేందర్ ను పార్టీలో చేర్చుకుని మల్కాజిగిరి ఎంపీ లేదా ఖైరతాబాద్ ఎంఎల్యే సీటు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. అదే పార్టీ నుండి ఘోషామహల్ ప్రాంతానికి చెందిన ముఖేష్ గౌడ్ ను కూడా టీఆర్ ఎస్ లోకి ఆహ్వానించాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కొత్త నాయకులకు టిక్కెట్లు ఇవ్వాలని కూడా టీఆర్ఎస్ ప్రణాళిక రచిస్తోంది. పాత జిల్లాల ప్రకారం ఇప్పటికే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నుండి చాలా వరకు ముఖ్య నేతలను టీఆర్ఎస్ పార్టీ రిజర్వ్ చేసుకుని పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
కరీంనగర్, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి ద్రుష్టి సారించినట్టు తెలుస్తోంది. దాంతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలపై ప్రత్యేక నిఘా పెట్టి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది.
2019లో గెలుపే లక్ష్యంగా పనిచేసే నాయకత్వం కోసం అన్వేషణ..
గ్రేటర్ హైదరాబాద్ లో పాగా వేయగలిగితే మొత్తం రాష్ట్రాన్ని గుప్పిట్లోకి తీసుకోవచ్చనేది టీఆర్ఎస్ వ్యూహంగా కనబడుతోంది. మొత్తానికి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు తీరాలకు చేర్చే పటిష్టమైన నాయకత్వం కోసం గులాబీ పార్టీ ఇప్పటినుండే కసరత్తు చేస్తోంది. పాత కొత్త నాయకుల కలయికలతో 2019 ఎన్నికలను ఎదుర్కొనేందుకు పావులు కదుపుతోంది. కొత్త నేతలు పార్టీ లోకి ప్రవాహంలా వచ్చి చేరుతుంటే పార్టీని నమ్ముకుని ఉన్న అసలు సిసలు నాయకులు తిరుగుబాటు చేస్తారా లేక గులాబీ బాస్ ఆజ్ఞలకు కట్టుబడి ఉంటారా చూడాలి.