ఎంపీగా ఉన్నప్పుడు మాట్లాడలేదేం? కాంగ్రెస్ వివరణ ఇవ్వాలి: రేణుకకు శివసేన
ముంబై/హైదరాబాద్: క్యాస్టింగ్ కౌచ్పై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా రంగమే కాదు మహిళలు పని చేసే ఏ ప్రాంతమూ.. చివరకు పార్లమెంటు కూడా క్యాస్టింగ్ కౌచ్కు అతీతంగా ఏమీ లేదని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
దీనిపై శివసేన తన అధికార పత్రిక సామ్నాలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని పేర్కొంది. ఆమె దేశంలోని మహిళలను అవమానపరిచారన్నారు. ఆమె ఎంపీగా ఉన్న కాలంలో దీని గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
ఆమె వ్యాఖ్యలే నిజమనుకుంటే దీనిపై వివరణ ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని శివసేన పేర్కొంది. దేశాన్ని ఎక్కువకాలం పాలించింది కాంగ్రెస్ అని, బీజేపీ గత నాలుగేళ్లుగానే అధికారంలో ఉందని గుర్తు చేసింది. ఎవరి హయాంలో ఇలాంటివి జరగాయో రేణుకా చౌదరి స్పష్టం చేయాలంది.
మరోవైపు, ఆమె వ్యాఖ్యలలోని వాస్తవాన్ని పక్కన పెట్టి మోడీ ప్రభుత్వం దీనిపై సీరియస్గా దృష్టి సారించాలన్నారు. ఒకవేళ క్యాస్టింగ్ కౌచ్ నిజమని రుజువు అయితే అది ఎప్పటి నుంచి సాగుతుందో విచారణ జరిపించాలన్నారు.