సింగరేణి ఘటనపై కేంద్రానికి కంప్లైంట్ చేస్తా ..అధికార పార్టీ నేతలే బినామీలతో ఓబీ పనులు . : బండి సంజయ్
సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులలో సంభవించిన భారీ పేలుడుతో నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఈ ఓపెన్ కాస్ట్ గనులను నిర్వహిస్తున్న మహాలక్ష్మి ఓబీ కంపెనీపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒకపక్క భారీ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఆందోళన బాట పట్టగా,సింగరేణి ప్రమాదం విషయంలో కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు.
Recommended Video
సింగరేణి పేలుడు ఘటన ..ఏపీ ఎఫెక్ట్ ..కోటి పరిహారం డిమాండ్..ఆస్పత్రి వద్ద బాధితుల ఆందోళనతో ఉద్రిక్తత
నిబంధనలు తుంగలో తొక్కారని ప్రమాదానికి కారణం అదే అన్న బండి సంజయ్
నిబంధనలు తుంగలో తొక్కి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఓపెన్ కాస్ట్ లో ప్రమాదం జరిగి నలుగురు కార్మికులు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని ఆయన మండిపడ్డారు. సింగరేణి రామగిరి మండల ఓపెన్ కాస్ట్ గనిలో జరిగిన ప్రమాదంపై విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్న నేపథ్యంలో వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోల్ మైన్స్,సేఫ్టీ అధికారులు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డిమాండ్
అంతేకాదు డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోల్ మైన్స్,సేఫ్టీ అధికారులు ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు.మృతి చెందిన కార్మిక కుటుంబాలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కమీషన్లకు కక్కుర్తిపడి నిబంధనలు గాలికి వదిలేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అధికారులు ప్రైవేటు కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు .
ప్రైవేట్ కాంట్రాక్టర్లు అధికారులకు అక్షయ పాత్రలా మారారన్న తెలంగాణా బీజేపీ చీఫ్
సింగరేణిలో అధికారులకు ప్రైవేటు ఓపెన్ కాస్ట్ కాంట్రాక్టర్లు అక్షయపాత్రలాగా మారిపోయారని బండి సంజయ్ విమర్శల వర్షం కురిపించారు. అధికార పార్టీ నేతలే ఓపెన్ కాస్ట్ గనుల్లో తమ బినామీల చేత కాంట్రాక్టులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపెన్ కాస్ట్ మైన్స్ లో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు, సింగరేణి కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకునేలాగా తాను కేంద్ర మంత్రుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకువెళతానని బండి సంజయ్ చెప్పారు.