కెసిఆర్పై దుమ్మెత్తి పోసిన ప్రతిపక్షాల నేతలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ప్రతిపక్షాల నేతలు దుమ్మెత్తిపోశారు. కాంగ్రెసు, బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను కెసిఆర్ పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లైఓవర్లు, స్కై ఓవర్ల పైనుంచి కిందికి దిగి రావాని కాంగ్రెస్ నేత జీవన్రెడ్డి హితవు పలికారు. అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించే తీరిక ముఖ్యమంత్రికి లేదా అని ఆయన ప్రశ్నించారు. జనానికి అదిచేస్తాం.. ఇది చేస్తామని ఊదరగొడుతున్న సీఎం మొదట పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సూచించారు.
పంటనష్టంపై వారంలోగా ప్రభుత్వం ప్రకటన చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అకాల వర్షంతో జిల్లాలో పంట నష్టపోయిన నిజామాబాద్ జిల్లా రైతులను టీడీపీ నేతలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడారు.
వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. ప్రధాని నరేంద్రమోడీని కలిసి తెలంగాణలో పంటనష్టంపై వివరిస్తామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేలు ఇవ్వాలన్నారు. వాణిజ్య పంటలకు రూ.30వేలు ఇవ్వడంతోపాటు రైతులకు బీమా సౌకర్యం కల్పించాలని ఎర్రబెల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
వాటర్ గ్రిడ్ పేరుతో రూ.45వేల కోట్లు దుర్వినియోగానికి ప్రభుత్వం తెరతీసిందని బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులే బినామీ పేర్లతో మిషన్ కాకతీయ పనులు చేస్తున్నారని ఆయన శనివారంనాడు కరీంనగర్లో అన్నారు.
మిషన్ కాకతీయ పనుల అంచనాల్లోనూ గందరగోళం నెలకొందన్నారు. వాటర్ గ్రిడ్ పేరుతో రూ.45కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని, రూ.ఏడువేల కోట్లతో ఇంటింటికీ నీరందించవచ్చని నాగం విమర్శించారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కరీంనగర్ జిల్లాను కెసిఆర్ పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.