అసెంబ్లీ సీట్ల పెంపును అడ్డుకోవాల్సిందే: ఇది టీ. కాంగ్రెస్ ప్లాన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను పునర్విభజించాలి. కానీ ఇరు రాష్ట్రాల నుంచిఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను సీఎంలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (తెలంగాణ), చంద్రబాబు (ఆంధ్రప్రదేశ్) ఫిరాయించారు.
ఆంధ్రప్రదేశ్ సంగతేమో గానీ తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి పాలక పక్షం.. కొద్దోగొప్పో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు తాయిలాలు చూపి గులాబీ దళంలో కలుపుకునేందుకు ప్రయత్నిస్తోంది.తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. ప్రస్తుత అధికార టీఆర్ఎస్ అనుసరిస్తున్న'ఫిరాయింపు' విధానాలు కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల పాలవుతోంది.
ఈ పరిస్థితుల్లో ప్రతిపాదిత అసెంబ్లీ స్థానాల పెంపునకు ఉద్దేశించిన బిల్లును అడ్డుకోవడమే మంచిదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చారు. మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి నేతృత్వంలో ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్ సి కుంతియా, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్ష నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వీ హనుమంతరావు, కేంద్ర మాజీమంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ తదితరులు హాజరయ్యారు.
స్థానాలు పెరిగితే కాంగ్రెస్ పార్టీకి నష్టమని నేతల భావన
టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సోషల్ మీడియా సమన్వయకర్తల నియామకం, రాష్ట్ర పునర్విభజన హామీలు, నియోజకవర్గాల పునర్విభజన తదితర అంశాలపై చర్చించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా సానుకూలంగా లేదనే కొందరు నేతలు అభిప్రాయ పడ్డారు. అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే అవకాశాలే ఉన్నాయని నేతలు పేర్కొన్నారు. పునర్విభజన ఆశలు చూపించి రాష్ట్రంలోని అన్ని పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి ఎమ్మెల్యేలను, ముఖ్యనేతలను చేర్చుకున్నారని, దీనిని దెబ్బకొట్టడానికి పునర్విభజన బిల్లును రాజ్యసభలో అడ్డుకోవాలన్న సూచన టీపీసీసీ సమావేశంలో వచ్చింది.
విభజన హామీలన్నీ అమలు చేస్తేనే స్థానాలు పెంచాలి
అయితే యూపీఏ అధికారంలో ఉన్నప్పుడే ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాన్ని వ్యతిరేకించడం మంచిది కాదన్న అభిప్రాయానికి మరికొందరు వచ్చారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలని, అప్పటిదాకా అసెంబ్లీ స్థానాల పునర్విభజనను కూడా ఆపాలని డిమాండ్ చేయడం మంచిదని ఎక్కువమంది సూచన చేశారు. దీనిపై మరోసారి చర్చించిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో మాట్లాడాలని సమావేశంలో నిర్ణయించారు.
రైతుకు సాయం కోసం రూ.8000 కోట్లు కావాలని అంచనా
ఇదిలా ఉంటే గతేడాది రెవెన్యూ లోటు, బకాయిలతో కొనసాగిన టీఆర్ఎస్ సర్కారుకు.. నూతన సంవత్సరం ఆర్థికంగా మరింత కీలకం, సంక్లిష్టం కానున్నది. వచ్చే ఏడాదిలో జరిగే సాధారణ ఎన్నికలే దీనికి కారణం. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాలు, తాయిలాల చుట్టూ ఆర్థిక పరిస్థితి పరిభ్రమణం చేయనున్నది. ఈ క్రమంలో గత కార్యక్రమాలకు తోడు మరిన్ని పథకాలు ముందుకు రానున్నాయని సమాచారం. వాటికి నిధుల సమీకరణే ఇప్పుడు సర్కారు ముందు ఉన్న అతిపెద్ద సవాల్. ఈ ఒరవడిలో ఇప్పటికే ప్రకటించిన 'రైతులకు ఎకరానికి రూ.4 వేల సాయం' కేసీఆర్ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం కానున్నది. లబ్దిదారులను గుర్తించటం, వారికి సమర్థవంతంగా సాయాన్ని అందజేయటం కష్టంతో కూడుకున్న పనిగా ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకోసం రూ.8 వేల కోట్లు అవసరమవుతాయని ఆర్థికశాఖ ఇప్పటికే అంచనా వేసింది.
బ్యాంకుల రుణాలు, బడ్జెటేతర నిధులతో సర్దుబాటు
రైతులకు రుణమాఫీ కింద గతేడాది వరకు ఏటా రూ.4,250 కోట్ల చొప్పున నాలుగుసార్లు ప్రభుత్వం విడుదల చేసింది. 2017తో ఈ పథకం పూర్తయింది. అందువల్ల ఇప్పటి వరకూ రుణమాఫీ కోసం విడుదల చేసిన రూ.4,250 కోట్లను ఇప్పటి నుంచి 'ఎకరానికి నాలుగు వేల' పథకానికి మళ్లించనున్నారని సమాచారం. ఇవిపోను మిగతా రూ.3,250 కోట్లను ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు మిషన్ భగీరథ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన 20 శాతం (రూ.4 వేల కోట్లు) నిధులను ఈ ఏడాది విడుదల చేయాల్సి ఉంది. ఈ పథకాన్ని 2018 చివరి నాటికి పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను కచ్చితంగా విడుదల చేయాలని ఆర్థికశాఖ వర్గాలు వివరించాయి. ఇప్పటి వరకూ బ్యాంకులు, నాబార్డు రుణాలతో వీటిని నడిపించారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ తదితర బకాయిల చెల్లింపు ఇలా కీలకం
రానున్నది ఎన్నికల సంవత్సరం కాబట్టి రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను దగ్గరకు చేర్చుకోవాలన్న ఆలోచనలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో బీసీ కార్పొరేషన్కు కూడా పెద్ద మొత్తంలో నిధులను కేటాయించే అవకాశముంది. వీటిని ఏ విధంగా సమీకరిస్తారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక సర్కారును కలవరపరిచే మరో అంశం భారీ స్థాయిలో పేరుకుపోయిన బకాయిలు. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్పులు, ఆరోగ్య శ్రీ, ఉపాధి కల్పనా పథకాలు, డిస్కామ్లు, ట్రాన్స్కో, జెన్కో, పౌర సరఫరాల శాఖ, పరిశ్రమలు, వడ్డీ లేని రుణాలు, స్థానిక సంస్థలు, వ్యవసాయ యాం త్రీకరణ, పాలీహౌజ్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజనం తదితరాంశాలకు కలిపి రూ.24 వేల కోట్లను ప్రభుత్వం చెల్లించాలి. మూడున్నరేళ్ల టీఆర్ఎస్ హయాంలో వీటిని పట్టించుకున్న నాథుడు లేడు. కానీ ఈ ఏడాది వీటిని కచ్చితంగా విడుదల చేయాలి. లేదంటే వీటి ప్రభావం ఎన్నికలపై ఉంటుందని విశ్లేషకుల అంచనా. ఈ నేపథ్యంలో బకాయిల విడుదలకు అవసరమైన నిధుల సమీకరణ కత్తిమీద సామే కానుంది.