ఆ జిల్లాలపై కక్ష కట్టారు: కెసిఆర్పై పోరుకు ఏకమైన విపక్షాలు
హైదరాబాద్: ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పునకు వ్యతిరేకంగా తెలంగాణలోని ప్రతిపక్షాలు ఒక్కటయ్యాయి. ప్రాజెక్టు డిజైన్ మార్పుపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ ప్రతిపక్షాల నాయకులు శనివారం గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపి, వైయస్సార్ కాంగ్రెసు, సిపిఐ నేతలు గవర్నర్ను కలిశారు. గవర్నర్తో భేటీ తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ప్రాణహిత - చేవెళ్ల మార్పు వల్ల హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు జరిగే నష్టాన్ని గవర్నర్కు వివరించినట్లు వారు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కక్ష కట్టారని వారు వ్యాఖ్యానించారు.
ఆ ప్రాజెక్టుకు వైయస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో వేయి కోట్ల రూపాయలు కేటాయించారని, ఇప్పుడు డిజైన్ మారిస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని వారన్నారు. డిజైన్ మార్పు వల్ల అంతర్ జిల్లా వివాదాలు తలెత్తుతాయని వారు చెప్పారు.
డిజైన్ మార్పునకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు చెప్పారు. అంతకు ముందు గన్పార్కులోని అమర వీరుల స్థూపం వద్ద అఖిల పక్ష నేతలు నివాళులు అర్పించారు.