హుజూర్ నగర్ లో ఫైనల్ డే: బంద్ లో విపక్ష నేతలు..నియోజకవర్గంలో గులాబీ నాయకులు: ఏం జరుగుతోంది..!
తెలంగాణలో అధికార..ప్రతిపక్షాలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూర్ నగర్ ఉప ఎన్నక ప్రచారం ఈ సాయంత్రంతో ముగియనుంది. పీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తం కుమార్ రెడ్డి ఎంపీగా గెలవటంతో..ఈ స్థానానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో..ఇక్కడ జరగుతున్న ఉప ఎన్నిక ద్వారా పార్టీ పట్టు..వ్యక్తిగతంగా ఉత్తమ్ రాజకీయ భవిష్యత్ కు ఈ ఎన్నిక కీలకంగా మారింది. అదే సమయంలో అధికారంలో ఉండి ఉప ఎన్నికలో గెలవక పోతే..ఇక రాజకీయంగా మొదలయ్యే సమస్యలు..ప్రచారాల పైన అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ విడుదల అయిన వెంటనే అభ్యర్దిని రంగంలోకి దించారు.
పార్టీ నేతలను గ్రామ గ్రామాన మొహరించారు. బీజేపీ..టీడీపీ అభ్యర్ధులు సైతం బరిలో ఉన్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఇక్కడ ఉప ఎన్నిక మీద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అధికార పార్టీ ఒక వైపు..ప్రతిపక్షాల వైపు ఒక వైపు అన్నట్టుగా ఈ ఎన్నిక మారింది. దీంతో..ఇది వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు పరీక్షగా మారుతోంది. చివరి రోజు ప్రచారం ద్వారా ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు అన్ని పార్టీలు చివరి ప్రయత్నాలు చేస్తున్నాయి.
నేటితో ప్రచారం సమాప్తం..
హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రంతో ముగియనుంది. ఇప్పటికే పోటీలో రాజకీయ పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల్లో ఓడిన పార్టీ అభ్యర్ది సైదిరెడ్డినే తిరిగి బరిలో నిలిపారు. నియోజకవర్గ పరిధిలోని మండలాలు..గ్రామాల వారీగా పార్టీ నేతలకు గెలుపు బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా తనకు పట్టు ఉన్న హుజూర్ నగర్ లో ఎలాగైనా గెలిచి తన రాజకీయ భవిష్యత్ కు ఇబ్బందులు లేకుండా చూసేకొనేందుకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ పావులు కదుపుతున్నారు. ఇది కాంగ్రెస్ కంటే ఉత్తమ్ కు వ్యక్తిగతంగా సవాల్ గా మారింది.
ఆయన భార్య పద్మావతి బరిలో ఉన్నారు. పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి సైతం పద్మావతికి మద్దతుగా ప్రచారం చేసారు. ఇక, బీజేపీ..టీడీపీ నేతలు సైతం బరిలో నిలిచారు. వారు సైతం జోరుగా ప్రచారం నిర్వహించారు. శనివారం సాయంత్రానికి ప్రచారం ముగియనుండటంతో అక్కడ పరిస్థితి పైన అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది.
ఉప ఎన్నికపై ఆర్టీసీ సమ్మెపై ఎఫెక్ట్..
ఒక వైపు ఉప ఎన్నిక ప్రచారం సాగుతున్న సమయంలోనే..ఆర్టీసీ సమ్మె రాష్ట్రంలో రాజకీయంగా సమీకరణాలను మార్చేసింది. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఒక మెట్టు దిగి అధికార పార్టీ సీపీఐ మద్దతు కోరింది. ఆ పార్టీ సైతం తొలుత మద్దతు ప్రకటించింది. అయితే, ఆర్టీసీ సమ్మెలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా మద్దతు ఉప సంహరించుకుంది. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రభుత్వం ఒక వైపు.. ఇతర పార్టీలన్నీ ఒక వైపు అనే విధంగా పరిస్థితి మారింది. ఇదే సమయంలో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ వైఖరి పైన ఆగ్రహంతో ఉన్నారు.
ఇతర ఉద్యోగా..ఉపాధ్యాయ..కార్మిక సంఘాలు సైతం ఆర్టీసీ సమ్మె విషయంలో ఒక్కటయ్యారు. దీంతో..నియోకవర్గంలోని వీరు ఎవరికి ఓట్లు వేస్తారనేది ఆసక్తి కంగా మారుతోంది. ప్రతిపక్షాల వారి ఓట్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. చివరి నిమిషంలో జరిగే పరిణామాల ఆధారంగా వారి ఓట్లు కీలకంగా మారనున్నాయి.
చివరి రోజు ప్రచారంలో కీలక నేతలు..
ఇక, కొద్ది గంటల్లో హుజూర్ నగర్ ప్రచారం ముగుస్తుండటంతో కీలక నేతలు అక్కడ ఫోకస్ చేసారు. ప్రతిపక్ష పార్టీల నేతలు బంద్ నిర్వహణ కోసం డిపోలు..రోడ్ల మీద ఉన్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇదే సమయంలో అధికార పార్టీ నేతలు నియోజకవర్గంలో గెలుపు కోసం చివరి ప్రయత్నాల్లో బీజీగా ఉన్నారు.
దీంతో...కొందరు కీలక నేతలు బంద్ కు దూరంగా ఉంటూ ద్వితీయ శ్రేణి నేతలతో బంద్ నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డి శనివారం హుజూర్నగర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి డాక్టర్ రామారావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అదే విధంగా పోలింగ్ ప్రారంభం అయ్యే లోగా ఆర్టీసీ విషయంలోనూ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని అక్కడ..వ్యతిరేక ప్రభావం పడకుండా జాగ్రత్త పడే అవకాశాలు లేక పోలేదు.