కేసీఆర్ పద్దుపై విపక్షాల పెదవి విరపు.. కాళేశ్వరానికి జాతీయ హోదా వద్దా..? అని ప్రశ్న
హైదరాబాద్ : కేసీఆర్ బడ్జెట్పై విపక్షాలు పెదవి విరిచాయి. పద్దు నిరాశగా ఉందని .. 9 నెలల ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శమని దాడికి దిగాయి. బడ్జెట్లో కీలక అంశాలను మరచిపోయారని .. ఇది సరికాదని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతిపై ప్రస్తావన లేకపోవడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తప్పుపట్టారు. ఇటు నర్సిరెడ్డి, రాంచందర్రావు కూడా కేసీఆర్ పద్దుపై మండిపడ్డారు. సరైన అంచనాలు లేకుండానే కేటాయింపులు చేశారని విమర్శించారు.
త్వరలో 57 ఏళ్ల వృద్ధులకు పెన్షన్ అమలు, ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్య శ్రీ మిన్న : కేసీఆర్
క్లారిటీ మిస్
లక్షా 46 వేల కోట్ల కేసీఆర్ బడ్జెట్ను ప్రతిపాదించారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. బడ్జెట్ చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. రుణమాఫీపై బడ్జెట్లో స్పష్టత ఇవ్వలేదని .. నిరుద్యోగుల ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతిపై బడ్జెట్లో ప్రస్తావించకపోవడం సరికాదన్నరు. తన వైఫల్యాలను కేంద్రంపై నెట్టే ప్రయత్నం కేసీఆర్ చేశారని విమర్శించారు. కమీషన్ల బాగోతం బయటకు వస్తుందనే కాళేశ్వరం ప్రాజెక్టుక జాతీయ హోదా అడగలేదన్నారు. మరోవైపు ఆరోగ్య శ్రీ అమలు చేస్తూనే ఆయుష్మాన్ భారత్ నిధులను కూడా తీసుకోవాలని సూచించారు.
ఎందుకు తగ్గించారు
తెలంగాణ పద్దు నిరాశజనకంగా ఉందన్నారు ఎమ్మెల్సీ నర్సీరెడ్డి. ఆర్థిక అంచనాలను లెక్కవేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. 5 నెలల కింద ప్రవేశపెట్టిన లక్ష 80 వేల కోట్ల బడ్జెట్ ఇప్పుడు ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. రైతుబంధు నగదు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. రాష్ట్రంలో ఉన్న 59 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించలేదన్నారు. ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీపై ప్రస్తావించకపోవడం దారుణమన్నారు.
తప్పించుకునేందుకే ..
తెలంగాణ పద్దు నిరాశజనకంగా ఉందన్నారు ఎమ్మెల్సీ రాంచందర్ రావు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పథకాలను పూర్తి చేయలేక కేంద్రంపై నెపం నెడుతుందన్నారు. చేసిన తప్పును అంగీకరించే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కేంద్రంపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇది సరికాదని హితవు పలికారు.