బెదిరింపు: స్పీచ్పై రేవంత్, అరుణ ఫైర్, ఇంటికో ఉద్యోగం అసాధ్యం: కెసిఆర్
హైదరాబాద్: శాసన సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రసంగంపై విపక్షాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డికె అరుణ, చిన్నా రెడ్డి, జీవన్ రెడ్డి, టిడిపి నేత రేవంత్ రెడ్డి, బిజెపి నేత డాక్టర్ కె లక్ష్మణ్ ఆదివారం దుయ్యబట్టారు.
చిన్నారెడ్డి మాట్లాడుతూ... సభలో సమాధానం చెప్పకుండా కెసిఆర్ సభ్యులను బెదిరించారని విమర్శించారు. ఫాంహౌస్లో ఉండి ఏం చేసినా చెల్లుతుందని, ఏం చేసినా నడుస్తుందని కెసిఆర్ భావిస్తున్నారని ధ్వజమెత్తారు.
జీవన్ రెడ్డి మాట్లాడుతూ... ఉప ఎన్నికల ఫలితాలు వాపు అని, ఆ వాపును చూసి కెసిఆర్ బలుపు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్లో తన కంటే నిపుణులు ఎవరూ లేరన్నట్లుగా కెసిఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు.
డికె అరుణ మాట్లాడుతూ.. కెసిఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని మండిపడ్డారు. నోటిని అదుపులో పెట్టుకొని సభ్యులకు గౌరవం ఇవ్వాల్నారు. బంగారు తెలంగాణను మట్టి తెలంగాణ మార్చకుండా ప్రతిపక్షాలు కాపాడుతున్నాయన్నారు.
కెసిఆర్ తన కుటుంబం ఆదాయం కోసమే ప్రాజెక్టుల నిర్మాణం అంటున్నారని ఆరోపించారు. కెసిఆర్ డబ్బుతో రాజకీయం చేస్తున్నారని డికె అరుణ అన్నారు. కెసిఆర్ ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదన్నారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు అవకాశమివ్వకుండా సభను వాయిదా వేశారన్నారు. కెసిఆర్ సభలో ఓ మాట, బయట మరో మాట చెబుతున్నారన్నారు. కెసిఆర్ తన సంపాదన కోసమే ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంటున్నారన్నారు.
టిడిపి నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సభ నిర్వహణ సరిగా లేదన్నారు. సభలో కేసిఆర్ ఏకపాత్రాభినేయం చేశారన్నారు. ప్రజాస్వామ్యం పైన కెసిఆర్కు విశ్వాసం లేదన్నారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని సమర్థించేలా కెసిఆర్ నిర్ణయం ఉందన్నారు. పాటలు, మాయమాటలతో తెరాస అధికారంలోకి వచ్చిందన్నారు.
బిజెపి నేత డాక్టర్ కె లక్ష్మణ్ మాట్లాడుతూ... ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. టిఆర్ఎస్, మజ్లిస్ పార్టీ కుమ్మక్కయ్యాయన్నారు. సభలో మాట్లాడేందుకు తమకు అవకాశమివ్వడం లేదన్నారు.
ఇంటికో ఉద్యోగం అనలేదు: కెసిఆర్
ఇంటికో ఉద్యోగం అని మేం చెప్పలేదని, అది సాధ్యం కాదని కెసిఆర్ శాసన మండలిలో అన్నారు. లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పామని, దానికి కట్టుబడి ఉన్నామన్నారు. హెచ్సియు, జెఎన్యు ఘటనలు బాధాకరమన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.
తెలంగాణలో ఇప్పుడు నిరంతర విద్యుత్ సరఫరా జరుగుతోందన్నారు. పోలీసు శాఖలో గొప్ప సంస్కరణలు తెచ్చామన్నారు. తెలంగాణలో క్రైం రేటు తగ్గిందని చెప్పారు. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందన్నారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుపై కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు.
సమైక్య ఏపీలో పక్క రాష్ట్రాలన్నింటితోను గొడవ అన్నారు. గొడవతో మనం సాధించింది ఏమీ లేదన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి పొరుగు రాష్ట్రాలతో ఉన్న సంబంధాలు తెగిపోయాయని కెసిఆర్ చెప్పారు. ఇది పాత ఏపీ కాదని, తెలంగాణ అని తాను పక్క రాష్ట్రాలతో చెప్పానని మండలిలో అన్నారు.
నేను బతికున్నంత వరకు తెలంగాణకు పది టీఎంసీల నీటిని ఎక్కువే తీసుకు వస్తా కాని అన్యాయం జరగనివ్వనని చెప్పారు. మైనార్టీలను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. విపక్షాలు అనవసర రాజకీయ విమర్శలు చేయవద్దన్నారు.