అమరావతి నుంచే: చంద్రబాబు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను డిసైడ్ చేశారా..?
Recommended Video
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అధికార పార్టీ విపక్ష పార్టీ నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. కత్తులు దూస్తున్నారు. ప్రజలు తమవైపు ఉన్నారని ఒకరంటే... లేదు అధికార పార్టీతో ప్రజలు విసుగెత్తిపోయారని విపక్షాలు అంటున్నాయి. మొత్తానికి మాటల తూటాలతో తెలంగాణ ఎన్నికల ఫీవర్ పెరుగుతోంది. ఓ వైపు టికెట్ల గోల మరోవైపు అసంతృప్తుల బెడద.. ఇంకోవైపు రాజీనామాల పర్వం. ఇవన్నీ ఈ సారి ఎన్నికల్లో కనిపిస్తున్నాయి. ఇవన్నీ పక్కకుబెడితే... అధికార పక్షానికి, బీజేపీకి మాత్రం ఉమ్మడి శతృవుగా ఏపీ సీఎం చంద్రబాబు కనిపిస్తున్నారు. ఆయనే టార్గెట్గా ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి.
తిమ్మిని బమ్మిని చేయగల సామర్థ్యం ఉన్న నేత చంద్రబాబు
చంద్రబాబు నాయుడు.... భారత దేశ రాజకీయాలను ఫాలో అవుతున్న వారికి పరిచయం అక్కరలేని పేరు. సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి. రాజకీయ పరంగా అంచనాలను తలకిందులు చేయగల సత్తా ఉన్న అపర చాణక్యుడు. తన రాజకీయ మేధస్సుతో ఒకప్పుడు అన్ని రాజకీయపార్టీలను శాసించారు. మళ్లీ ఇప్పుడు అదే ఫార్ములాతో బీజేపీ వ్యతిరేక శక్తులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకప్పుడు బీజేపీకి అండగా ఉన్నారు... ఇప్పుడు కాంగ్రెస్తో కలిసి పయనిస్తున్నారు. అదే తేడా... మిగతాదంతా సేమ్టూ సేమ్. ఇక తెలుగు రాష్ట్రాలపై వాటి స్థితిగతులపై పట్టున్న నాయకుడు చంద్రబాబు. ఆయన ఏ క్షణమైన చక్రం తిప్పగలిగే సామర్థ్యం ఉన్న నేతగా విపక్షాలు సైతం చూస్తున్నాయి. అందుకే చంద్రబాబును అత్యంత జాగ్రత్తగా డీల్ చేస్తాయి విపక్షాలు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకంటే ఎక్కువగా చంద్రబాబునే ఇటు టీఆర్ఎస్ కానీ, అటు బీజేపీ కానీ టార్గెట్ చేసి తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి.
కూటమి వస్తే తెలంగాణ పాలన అమరావతి నుంచే...
కమలం పార్టీని వ్యతిరేకించిన చంద్రబాబు ఎవరూ ఊహించని విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో టీడీపీకి బద్ధ శతృవైన కాంగ్రెస్తోనే జతకట్టారంటే ఆయన రాజకీయ చతురత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. దీనిపైనే టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీ పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. ఎన్టీఆర్ నాడు ఏ ఉద్దేశంతో పార్టీని పెట్టాడో ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తూ చంద్రబాబు కాంగ్రెస్తో కలవడం టీడీపీ కార్యకర్తలే జీర్ణించుకోలేకున్నారని విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీతో ఎలా కలిసి పోటీచేస్తోందో ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ, టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణకు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసిన చంద్రబాబు వైఖరి తెలిసి కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం తన వినాశనం కొని తెచ్చుకుంటోందని విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే అమరావతి నుంచి తెలంగాణ పాలన జరుగుతుందని ఆరోపించాయి. అంతేకాదు ఎన్నికల బరిలో దిగే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సైతం అమరావతిలోనే తయారైందని బీజేపీ ఆరోపిస్తోంది.
అమరావతిలో తయారైన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా
కాంగ్రెస్ అభ్యర్థులతో కూడిన జాబితా విడుదల కాగానే బీజేపీ దీనిపై తీవ్ర విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ జాబితాను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తయారు చేశారని ఆరోపించారు బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు. ఇది ఎప్పుడైతే ఢిల్లీలోని ఏపీ భవన్లో చంద్రబాబును తెలంగాణ పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారో అప్పుడే స్పష్టమైందని తెలిపారు. ఆ తర్వాత జాబితా విడుదల చేసే ఒక్క రోజు ముందు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ విజయవాడలో సీఎం చంద్రబాబును ఎందుకు కలిశారు.. అని కృష్ణసాగర్ రావు ప్రశ్నించారు. అశోక్ గెహ్లాట్ చంద్రబాబను కలవడంతో జాబితా అమరావతిలోనే తయారైందన్న విషయం మరింత తేటతెల్లం అయ్యిందని కృష్ణసాగర్ రావు ఆరోపించారు. దీన్ని చూస్తే చంద్రబాబు నాయుడు తెలంగాణలోని కాంగ్రెస్ను ఆడిస్తున్నారన్న విషయం ఎవరికైనా అర్థమవుతుందని కృష్ణసాగర్ రావు అన్నారు.