ఇరికించేందుకే: కెటిఆర్, బెదిరిస్తున్నారు.. ఏపీ కాంగ్రెస్ టిడిపిలో విలీనమైందా: పోచారం
హైదరాబాద్: ప్రతిపక్షాలు కలిసి రాకున్నా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం అన్నారు. సికింద్రాబాద్ బ్లూ ఇంపీరియల్ గార్డెన్లో జిటో బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్ ఎక్స్పో-2015లో ఆయన పాల్గొన్నారు.
జెయిన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ ఎక్స్పో జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు తదితరులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులపై ప్రతిపక్షాలకు ప్రత్యేక ఎజెండా ఏమీ లేదన్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే బంద్కు పిలుపునిచ్చారన్నారు. రెండో శనివారం రోజు ప్రతిపక్షాలు బంద్కు పిలుపునిచ్చాయన్నారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు, విద్యుత్ను అందిస్తున్నామని, ప్రతిపక్షాలు కలిసి రాకున్నా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందన్నారు. పదిహేను నెలల పాలనలోనే దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే కరెంటు కొరతను అధిగమించామని చెప్పారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తీసుకు వచ్చామన్నారు. సింగిల్ విండో విధానం ద్వారా అవినీతికి తావు లేకుండా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామన్నారు. పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు సంబంధించిన అన్ని అనుమతుల మంజూరు చేస్తున్నామన్నారు.
పెట్టుబడిదారులకు మా ప్రొటోకాల్ టీమ్ విమానాశ్రయంలోనే స్వాగతం పలుకుతుందన్నారు. హైదరాబాద్ ఒక మినీ ఇండియా అన్నారు. హైదరాబాద్లో వివిధ రాష్ర్టాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని, పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలమైన ప్రాంతమన్నారు.
టిడిపిలో కాంగ్రెస్ విలీనమైందా: పోచారం
ఓటేయకుంటే ఏపీలో కలుపుతామని కాంగ్రెస్ నేత బలరాం నాయక్ బెదిరించారని, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రావడం ఇష్టం లేదా అని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆందోళనలు చేయడం లేదని నిలదీశారు.
ఏపీ కాంగ్రెస్ టిడిపిలో విలీనమైందా అని ప్రశ్నించారు. ఇవాల్టి బందుకు రైతుల మద్దతు లేదన్నారు. తమ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. కెసిఆర్ పైన నమ్మకంతోనే విపక్షాల బందుకు రైతులు సహకరించడం లేదని జూపల్లి కృష్ణారావు అన్నారు.