కెసిఆర్ జూదానికి సోమేష్ బకరా: దాసోజు, పాతరేస్తామని మర్రి
హైదరాబాద్: ఓటర్ల జాబితాలోంచి పేర్లు తొలగించిన వ్వవహారంపై ప్రతిపక్షాలకు ఇంతకు జిహెచ్ఎంసి కమిషనర్గా పనిచేసిన ఐఎఎస్ అధికారి సోమేష్ కుమార్ టార్గెట్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు రాజకీయ స్వార్థానికి సోమేష్ కుమార్ బకరా అయ్యారని కాంగ్రెసు నాయకుడు దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.
కార్మికుల పొట్టకొట్టి కేసీఆర్ జేబులు నింపుకున్నారని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐ ప్రశ్నించడంపై కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. భూములనే కాపాడలేని సీఎం రాష్ట్రాన్ని ఎలా పాలించగలరని ఆయన ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రాజకీయ జూదానికి ఫలితమే వరంగల్ ఉప ఎన్నికలు వచ్చాయని తెలిపారు.
చట్టవిరుద్ధంగా ఓట్ల తొలగింపు జరిగిందని కాంగ్రెసు నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై ఆయన కేంద్ర బృందానికి ఫిర్యాదు చేశారు. సోమేష్ కుమార్, ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంత స్థాయిలో ఓట్ల తొలగింపు ఎప్పుడూ జరగలేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య పునాదులనే తొలగించే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు.
జిహెచ్ఎంసీ కమిషనర్ పదవి నుంచి సోమేష్కుమార్ను బదిలీ చేయడంతో సరిపెట్టక ఆయన్ని విధుల నుంచి తొలగించాలని మర్రి శశిధర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓట్ల తొలగింపునకు కారణమైన సోమేష్ను పాతరేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమేష్తో పాటుగా ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్పై కూడా చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు.
సనత్నగర్ నియోజకవర్గంలో 25 వేల ఓట్లు తొలగించడం దుర్మార్గమని శశిధర్ మండిపడ్డారు. అందుకు సంబంధించిన ఆధారాలను జీహెచ్ఎంసీ నుంచి తానే తస్కరించానని, దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కేసీఆర్ కావాలనే సోమేష్ను అడ్డుపెట్టుకుని ఓటర్లను తొలగించారని విమర్శించారు. ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల బృందానికి అన్ని ఆధారాలు సమర్పించామని శశిధర్ రెడ్డి తెలిపారు.
అక్రమంగా ఓట్ల తొలగింపునకు సోమేష్ కుమార్ బాధ్యుడని బిజెపి నేత ఇంద్రసేనా రెడ్డి ఆరోపించారు. ఓట్ల తొలగింపుపై చర్యలు తీసుకుంటామని కేంద్ర బృందం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
వైసిపిని టిఆర్ఎస్ ప్రోత్సహిస్తోంది..
దేశం కోసం గాంధీ, నెహ్రూ కుటుంబాలు ప్రాణత్యాగం చేశాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్యాగధనుల విషయంలో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.
వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్దే గెలుపని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఓట్లను చీల్చేందుకు టీఆర్ఎస్ వైసీపీని ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సుధాకర్రెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వంలో చలనం లేదు..
రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుంటే ప్రభుత్వంలో చలనం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాగార్జునసాగర్ ఎడమకాలువ పరిధిలో పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కృష్ణా నీళ్లు విడుదల చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యల సంఖ్య కుదించడం సరికాదు మోత్కుపల్లి అన్నారు.