మంథని మధుకర్ మృతదేహానికి రీపోస్టుమార్టమ్: ముమ్మాటికీ హత్యేనంటున్న తల్లి..
మధుకర్ ఘటన కచ్చితంగా కుల కోణంలో జరిగిన దురహంకార హత్యేనని తమ్మినేని చెప్పారు. ఘటనపై తమ పార్టీ నియమించిన చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్య, జగదీశ్ లతో కూడిన కమిటీ దీన్ని నిర్దారించిందని అన్నారు.
హైదరాబాద్: మంథని మధుకర్ మృతి కేసులో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం నాడు మంథనిలో నిర్వహించిన మెరుపు ధర్నా ప్రభుత్వానికి సెగ తగిలేలా చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటూ.. అప్పటిదాకా ఘటనపై స్పందించని మంథని ఎమ్మెల్యే పుట్ట మధు సోమవారం తొలిసారిగా ఘటనపై నోరు మెదిపారు.
కేసీఆర్కు మంథని దెబ్బ:మూడెకరాలు పోయి ఆరడగుల జాగనా?, 'మధుకర్' ఘటనపై పెల్లుబికిన ఆగ్రహం
ఘటన వెనుక కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కుట్ర ఉందని, ఇందులో తన ప్రమేయం ఏమి లేదని పుట్ట మధు చెబుతుండగా.. విపక్షాలు మాత్రం స్థానిక ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు లేవనెత్తుతున్నాయి. రాజకీయ నాయకులపై అనుమానాలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దోషులకు శిక్షపడేలా సమగ్ర విచారణ జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఛలో మంథని: కులోన్మాదానికి బలైన 'మధుకర్' పాశవిక హత్యను నిరసిస్తూ..
రీపోస్టు మార్టం:
మంథని మధుకర్ మృతికి సంబంధించి దళిత, ప్రజాస్వామిక సంఘాలు చేసిన ధర్నాతో పోలీస్ అధికారులు దిగివచ్చిన సంగతి తెలిసిందే. కేసును డీల్ చేస్తున్న సింధు శర్మ మృతదేహానికి రీపోస్టు మార్టమ్ చేయాలని నిర్ణయించారు. మరో రెండు మూడురోజుల్లో రీపోస్టు మార్టమ్ చేసే అవకాశాలు కనిపిస్తుండగా.. ఈ మేరకు మంథని తహశీల్దార్ కు డీసీపీ కె.విజేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
కాల్ డేటా ఆధారంగా:
మధుకర్ అదృశ్యం అయిన రోజు గ్రామానికే చెందిన వ్యక్తే తమ కుమారుడిని బైక్ పై తీసుకెళ్లాడని మధుకర్ తల్లి చెబుతోంది. దీంతో కాల్ డేటా ఆధారంగా విచారణ జరపాలని పోలీసు నిర్ణయించారు. మృతదేహం దొరికిన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి 20మీటర్ల దూరంలో లభించిన క్రిమిసంహారక డబ్బా, మధుకర్ కర్చీఫ్, చున్నీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని సేకరించారు.
కొట్టి చంపేశారు కాబట్టే:
మృతుడి సోదరుడు సమ్మయ్య వెల్లడించిన వివరాల ప్రకారం.. మధుకర్ ప్రేమించిన యువతి ఫోన్ చేసి మధు ఉన్నాడా? అని అడిగింది. ఇంటి వెనుకాల ఉన్న కాలువ పక్కన చూడమని చెప్పడంతో.. వెళ్లి వెతికాం. అయినా ఎక్కడా కనిపించలేదు. చివరకు మా ఊరికే చెందిన ఓ వ్యక్తిని గట్టిగా నిలదీస్తే సబ్ స్టేషన్ పక్కన వెతకమని చెప్పాడు. మొగిలి అనే వ్యక్తి చెప్పిన స్థలంలోనే మృతదేహం ఉంది. కొట్టి చంపేశారు కాబట్టే మృతదేహం అక్కడుందని సమ్మయ్య చెప్పారు.
సీఐ పట్టించుకోలేదు: మధుకర్ తల్లి
మా గ్రామానికే చెందిన ఐదుగురు, అమ్మాయి తండ్రి కలిసి నా కొడుకును దారుణంగా హత్య చేశారు. ఒళ్లంతా గాయాలే ఉన్నాయి. నోట్లో మట్టి పోశారు. ఒళ్లంతా గాయాలున్నాయని సీఐకి చెప్పినా వినలేదు. మమ్మల్ని నోరు ఎత్తనివ్వలేదు. మా ఊరికి చెందిన వ్యక్తే మోటార్ సైకిల్ పై నా కొడుకును తీసుకుపోయారు. వీరిని అరెస్టు చేస్తేనే కుమారుడి ఆత్మకు శాంతి.
హోంమంత్రి స్పందించాలి:
మంథని మధుకర్ ఘటనపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పందించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. మధుకర్ మృతిపై బాధిత కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారికి న్యాయం జరిగేలా కేసు విచారణ జరగాలని సోమవారం నాడు ఒక ప్రకటన చేశారు. దోషులు ఎట్టిపరిస్థితుల్లోను తప్పించుకోవద్దని అన్నారు.
సీబీఐ విచారణ జరిపించాలి:
మధుకర్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు ఆయన వినతిపత్రం అందజేసినట్లుగా తెలుస్తోంది.సీబీఐ విచారణతో పాటు బాధిత కుటుంబానికి రూ.25లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా తమ్మినేని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కుల దురహంకార హత్యే:
మధుకర్ ఘటన కచ్చితంగా కుల కోణంలో జరిగిన దురహంకార హత్యేనని తమ్మినేని చెప్పారు. ఘటనపై తమ పార్టీ నియమించిన చెరుపల్లి సీతారాములు, జి.నాగయ్య, జగదీశ్ లతో కూడిన కమిటీ దీన్ని నిర్దారించిందని అన్నారు. మధుకర్-శిరీష ప్రేమపెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అడ్డుచెప్పారని, ఈ నేపథ్యంలోనే మధుకర్ ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. మధుకర్ భౌతిక కాయానికి రీపోస్టుమార్టమ్ చేయాలని తమ్మినేని విజ్ఞప్తి చేశారు.
శిరీష బయటకొస్తే నిజాలు:
మధుకర్ అనుమానస్పద మృతి తర్వాత అతను ప్రేమించిన అమ్మాయి శిరీషకు సంబంధించిన వివరాలేమి బయటకు రాలేదు. మధుకర్ శవాన్ని గుర్తించిన రోజు ఫోన్ చేసి 'మావాళ్లు మీకేమి చెప్పలేదా.. ఇంటి చుట్టూ, కాలువల్లో వెతకండి' అని చెప్పిన మాటలే ఆమె చివరిసారిగా చేసిన వ్యాఖ్యలు.
ఈ నేపథ్యంలో శిరీష బయటకొచ్చి నోరు విప్పితే అసలు నిజాలేంటో తెలుస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లి ఏసీపీ సింధుశర్మ రీపోస్ట్ మార్టమ్ కు హామి ఇవ్వడంతో దళిత, ప్రజాస్వామిక సంఘాలు ఆదివారం నాడు తాత్కాళికంగా నిరసన విరమించాయి. కేసు పురోగతిని బట్టి తమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయా సంఘాలు చెబుతున్నాయి.