లక్కీ డ్రా పేరుతో మోసం: 3 వేల మంది నుంచి నగదు వసూల్, ఉడాయించిన నిర్వాహకులు...
చిట్టీలు, లక్కీ డ్రా పేరు చెప్పి మోసం చేసే ఘటనలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో చోట ఇలాంటి ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నడిబొడ్డున లక్కీ డ్రా పేరుతో మోసం చేశారు. భారీ లక్కీ డ్రా అని చెప్పి.. అమాయకుల నుంచి వేలాది రూపాయలు వసూల్ చేశారు. కానీ కొందరికీ అలా ఇచ్చి.. మిగతా వారికి ఇవ్వకపోవడంతో అనుమానం రావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. లక్కీ డ్రా పేరుతో మోసం చేసిన నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
లక్కీ డ్రా పేరుతో మోసం..
పాతబస్తీ కామాటిపురలో లక్కీ డ్రా పేరుతో స్థానికులకు ఆకట్టుకున్నారు. కొందరు తొలుత నమ్మకపోయినా.. తర్వాత విశ్వసించాల్సి వచ్చింది. అలా మూడు వేల మంది అందులో చేరారు. లక్కీ డ్రా కోసం చిట్టీ వేసి తమకు డ్రా ఎప్పుడు వస్తుందోనని ఆశగా ఎదురుచూశారు. కానీ వారు ఆశించింది జరగలేదు. డబ్బులు కట్టించుకున్న కేటుగాళ్లు మెల్లగా ఉడాయించారు. దీంతో తాము మోసపోయామని బాధితులు గ్రహించారు.
పరారీలో ఏజెంట్లు
బాధితుల ఫిర్యాదుతో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. లక్కీ డ్రా పేరుతో మోసం చేసిన నలుగురు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. లక్కీ డ్రా స్కీం.. బాధితుల వివరాలు, వారి పార్ట్నర్ల గురించి ఆరాతీశారు. అయితే పరారీలో మరో నిర్వాహకుడు ఉన్నారని పోలీసులు తెలిపారు. 33 మంది ఏజెంట్లు కూడా తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని పేర్కొన్నారు.
3 వేల మంది
లక్కీ డ్రాలో తమకు ఏదైనా బహుమతి వస్తుందోనని ఆశించి దాదాపు 3 వేల మంది చేరారు. కానీ వారిని నిర్వాహకులు నట్టేట ముంచారు. నిర్వాహకులకు నగదు భారీ మొత్తంలో కనిపించడంతో ఇదే సరైన సమయం అని భావించి. మెల్లగా తట్ట బుట్ట సర్దుకొని మరీ ఉడాయించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కటకట్టాల్లోకి వెళ్లారు. నిర్వాహకుల నుంచి 12.62 లక్షల నగదు, లక్కీ డ్రా కాయిన్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.