అరుదైన చికిత్స: పేద బాలుడి ప్రాణాలు కాపాడిన ఉస్మానియా వైద్య బృందం
హైదరాబాద్: ఆరేళ్ల వయసు నుంచి హిమోఫీలియా వ్యాధితో బాధపడుతున్న ఓ పేద బాలుడికి ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేసి ప్రాణం పోశారు. సుమారు రూ. 7 లక్షల ఖర్చయ్యే చికిత్సను ఉచితంగా చేసి ఆ బాలుడి ప్రాణాలను కాపాడి వైద్యులు తమ మానవత్వాన్ని చాటుకొన్నారు.
వివరాల్లోకి వెళితే, హైదరాబాద్లోని హబ్సిగూడలో నివాసం ఉంటున్న కేవీఎన్ సాయితేజ (19) గతనెల 8న రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రిలో చేరాడు. హిమోఫీలియా వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని గ్రహించిన వైద్య బృందం తగిన జాగ్రత్తలతో చికిత్స ప్రారంభించారు.
జనవరి 25న ఉస్మానియాకు చెందిన ఆర్థో, అనస్థీషియా వైద్య నిపుణులు జే సత్యనారాయణ, రవికుమార్, లక్ష్మీనారాయణ, వినయ్ బాధితుడికి చికిత్స చేశారు. వ్యాధి తీవ్రత అప్పటికే ఫ్యాక్టర్-7కు చేరుకోవడంతో 14 వాయల్స్ను ఇచ్చారు. ఒక్కో వాయల్ ఖర్చు రూ.42 వేలుగా ఉంది.
ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ జీవీఎస్ మూర్తి, ఆర్ఎంవో కే అంజయ్య, ఎన్ శ్రీనివాసరావు, సీజీ రఘురాం, కోదండపాణి ఈ శస్త్రచికిత్సలో కీలకంగా వ్యవహరించారు. పేద యువకుడికి ప్రాణాలు కాపాడిన ఉస్మానియా వైద్య బృందంపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరోవైపు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి సైతం వారిని అభినందించారు. ఉస్మానియా ఆసుపత్రికి రాబోయే రోజుల్లో మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తామనే ఆశాభావాన్ని ఈ సందర్భంగా వైద్య బృందం వ్యక్తం చేసింది.