ఉస్మానియాలో వైద్య విద్యార్థిని శ్రావణి ఆత్మహత్య: ప్రేమ వ్యవహారమే కారణమా?
హైదరాబాద్: ఉస్మానియా వైద్య కళాశాలలో వైద్య విద్యార్థిని శ్రావణి ఆత్మహత్య తీవ్ర సంచలనం రేపింది. హైదరాబాదులోని ఉస్మానియా వైద్య కళాశాల పిజీ హాస్టల్లో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణమై ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అనస్తీయా ఎక్కువ మోతాదులో ఉన్న సెలైన్ శరీరంలోకి ఎక్కించుకుని శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆత్మహత్యకు పాల్పడిన శ్రావణిది నల్లగొండ జిల్లా మిర్యాలగుడా స్వస్థలం.
హైదరాబాదులోని అఫ్జల్ గంజ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం అర్థరాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మిత్రులు ఆమెను ఆస్పత్రికి తరలించేలోగానే ఆమె మరణించింది. 27 ఏళ్ల శ్రావణి ఉస్మానియాలో పిజి ఫైనలియర్ చదువుతోంది.
ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే, కారణమేమిటనేది ఇప్పుడే చెప్పలేమని పోలీసులు అంటున్నారు.