ఉస్మానియాలో రాహుల్ పర్యటన సక్సెస్ అవుతుందా..? అడ్డుకునేందుకు విద్యార్థుల యత్నం
Recommended Video
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఈనెల 13 14న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఈ టూర్లో భాగంగా... తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న ఉస్మానియా యూనివర్శిటీలో ఓ సెమినార్లో పాల్గొని ప్రసంగించనున్నారు. రాహుల్ పర్యటన సందర్భంగా విద్యార్థులు రెండుగా విడిపోయారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని భావిస్తున్న విద్యార్థులు ఒక గ్రూపుగా ఉంటే... టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచే విద్యార్థులు మరో గ్రూపుగా తయారయ్యారు.వీరు ఉస్మానియాకు రాహుల్ రాకుండా అడ్డుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు ఉస్మానియాలో రాహుల్ సెమినార్ను సక్సెస్ చేస్తామని కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘమైన NSUI పనిచేస్తోంది.
రాహుల్ గాంధీ ఉస్మానియాలో అడుగుపెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు కొందరు విద్యార్థులు, విద్యార్థి నాయకులు. రాహుల్ క్యాంపస్లోకి అడుగుపెడితే ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయని పేర్కొంటూ మరో లేఖను వీసీకి అందించారు విద్యార్థులు. యూనివర్శిటీల్లో రాజకీయ నేతల ప్రసంగాలు అనుమతించకూడదని ఉన్నతస్థాయి నిర్ణయం ఉన్నందున ఈ విషయంలో వీసీ ఎలా స్పందిస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అయితే రాహుల్ పర్యటనపై ఇంటెలిజెన్స్ రిపోర్టు తెప్పించుకున్నాకే ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ఒక వేళ ఉద్రిక్తవాతావరణం కనిపించే అవకాశాలు ఉంటే రాహుల్ ఉస్మానియా పర్యటన రద్దు చేసుకోవాలని ప్రభుత్వ చెబుతోంది. మరోవైపు ప్రభుత్వంకు అనుకూలంగా ఉన్న విద్యార్థులు ఏపీ ప్రత్యేక హోదాకు రాహుల్ పార్లమెంటులో ఎలా మద్దతు తెలుపుతారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి మళ్లీ తెలంగాణకు అన్యాయం చేస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకే రాహుల్ పర్యటనను కచ్చితంగా అడ్డుకుని తీరుతామని వారు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే రాహుల్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వమే విద్యార్థులతో ఇలా అడ్డుకునే కార్యక్రమం చేస్తోందని ఆరోపించారు పీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్శిటీ కీలకంగా వ్యవహరించిందని గుర్తు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రాహుల్ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఇకపై ప్రతినెలా రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తారని ఉత్తమ్ తెలిపారు.ఈసారి పర్యటనలో కాంగ్రెస్ కేడర్తో పాటు మహిళలు, సెటిలర్లు, ఎడిటర్లు, యువపారిశ్రామికవేత్తలు, ముస్లిం మేధావులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారని వివరించారు.