బీఫ్ ఫెస్టివల్ రగడ: 'నన్ను అరెస్ట్ చేస్తే ఏమీ కాదు, కిషన్ రెడ్డి బుద్ది వక్రీకరించింది'
హైదరాబాద్: విద్యార్థి సంఘాలు ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించ తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. బీఫ్ ఫెస్టివల్ను అడ్డుకుంటామని హెచ్చరించిన బిజెపి శాసనసభ్యుడు రాజా సింగ్ను పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం ఆయన్ని గోషామహల్ ఎసిపి కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ జరపకూడదన్నదే తన లక్ష్యమని ఆయన చెప్పారు. తనని అరెస్ట్ చేసినంత మాత్రాన ఏమీ కాదన్నారు. రాజకీయ లబ్ధి కోసం దీనిని తాను వాడుకోవడం లేదన్నారు.
బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బుద్ధి వక్రీకరించదన్నారు. అందుకే బీఫ్ ఫెస్టివల్కు ఆయన అనుకూలంగా ఉన్నారని అన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ను ముందుస్తుగా అరెస్ట్ చేశామని, పరిస్థితిని బట్టి ఆయన్ని విడదల చేస్తామని ఏసీపీ రాంభూపాల్ రావు చెప్పారు.
కాగా, ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ నేపథ్యంలో గోషామహాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి బీజేపీ కార్యకర్తలు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన గో సంరక్షణ సమితి నిర్వహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీలోకి వస్తున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన లోపలికి అనుమతిస్తున్నారు. ఓయూలోకి వెళ్లేందుకు యత్నించిన శివసేన కార్యకర్తలను సైతం పోలీసులు అడ్డుకున్నారు. ఉస్మానియాలో ఎన్ఆర్ఎస్ హాస్టల్లో నాన్ బోర్డర్స్ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.
గోవులను సంరక్షించే బాధ్యత అందరిదీ: స్వామి పరిపూర్ణానంద
గోవులను సంరక్షించే బాధ్యత అందరిదని స్వామి పరిపూర్ణానంద అన్నారు. నగరంలోని లోయర్ ట్యాంకుబండ్ దగ్గర గోపూజ మహోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. గోవులను కాపాడేందుకే గోపూజ మహోత్సవాన్ని చేపట్టామన్నారు.
ప్రభుత్వం గోక్రాంతి పథకాన్ని ప్రవేశపెడితే రైతులకు మేలు జరుగుతుందని, రైతుల ఆత్మహత్యలు ఆగే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఆవు పాలు ప్రయోజనాలపై ప్రచారం చేయాలని సూచించారు.
యూనివర్సిటీ రహదారులన్నీ మూసివేశారు. ఎన్సీసీ గేటు, తార్నాక వెళ్లే మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. మీడియాకు సైతం అనుమతి నిరాకరించారు. సిటీ సివిల్కోర్టు ఆదేశాల ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీలో యథాతథస్థితి కొనసాగించాలని, ఎటువంటి ఫెస్టివల్స్ నిర్వహించకూడదని ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఈ సురేశ్కుమార్ విద్యార్థులను కోరారు.
చట్టాన్ని ఉల్లంఘిస్తే విద్యార్థులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్సిటీ ప్రతిష్ఠను పెంపొందించేందుకు కృషిచేయాలి తప్ప, దానిని దిగజార్చకూడదని హితవు పలికారు. అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగేశ్వర్రావు, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణతో కలిసి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదన్నారు. వర్సిటీకి 2015 చరిత్రాత్మక సంవత్సరమని, ఈ ఏడాది ఇండియాటుడే-నీల్సన్ సర్వేలో రాష్ట్రస్థాయి యూనివర్సిటీలలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని వివరించారు. వర్సిటీలో బీఫ్ ఫెస్టివల్, పోర్క్ ఫెస్టివల్, గోపూజ వంటివి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కావాలంటే ఎవరి ఇండ్లవద్ద వారు, షాదీఖానాల్లో, వర్సిటీ బయట నిర్వహించుకోవాలని సూచించారు. వర్సిటీలో మాత్రం అనుమతించబోమన్నారు. దీన్ని ఉల్లంఘించిన విద్యార్థుల అడ్మిషన్ల రద్దుతో పాటు చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.