ఓయూ క్యాంపస్లో విద్యార్థినుల ఆందోళన.. ఆగంతకుడు చొరబడ్డ ఘటనపై సీరియస్..!
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో కలకలం రేగింది. గురువారం తెల్లవారుజామున ఇంజనీరింగ్ కాలేజీ అనుబంధ లేడీస్ హాస్టల్లోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడటం దుమారం రేపింది. సెక్యూరిటీ పేలవంగా ఉందనే ఆరోపణలు వినిపించాయి. ఆ క్రమంలో విద్యార్థినులకు రక్షణేది అనే వాదనలు జోరందుకున్నాయి.
ఓయూ క్యాంపస్లో తమకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తూ విద్యార్థినులు నిరసనకు దిగారు. సరైన సెక్యూరిటీ కల్పించకపోవడం వల్లే ఆగంతకుడు హాస్టల్లోకి ప్రవేశించాడని మండిపడ్డారు. శుక్రవారం నాడు క్యాంపస్లో ఆందోళన చేపట్టారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. అయితే గురువారం తెల్లవారుజామున ఆగంతకుడు లేడీస్ హాస్టల్ లోకి చొరబడ్డాడనే ఘటనపై వర్సిటీ అధికారులు స్పందించారు. హాస్టల్ ప్రహరీ గోడను పెంచడమే గాకుండా అవసరమైన మేరకు సీసీ కెమెరాలను అమర్చి నిఘా పెంచుతామని హామీ ఇచ్చారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ లోకి ఓ ఆగంతకుడు చొరబడటం చర్చకు దారి తీసింది. సెక్యూరిటీ లోపభూయిష్టంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున 2.30 - 3.00 గంటల ప్రాంతంలో ఇంజినీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్లోకి ఆగంతకుడు వచ్చాడు. వసతి గృహం వెనుక వైపు నుంచి లోపలికి దూకాడు. అదే సమయంలో ఓ విద్యార్థిని బాత్రూమ్కు వెళ్లారు. ఆ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి బాత్రూమ్ లోకి చొరబడి సదరు విద్యార్థినిని కత్తితో బెదిరించాడు. అంతేకాదు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
ఆగంతకుడి తీరుతో మొదట ఆమె భయపడ్డా.. చివరకు ధైర్యం చేసి గట్టిగా కేకలు వేశారు. దాంతో హాస్టల్లో ఉండే కొందరు విద్యార్థినులు అక్కడకు చేరుకున్నారు. వారందర్నీ చూసి భయపడి పరుగు లంకించుకున్నాడు ఆగంతకుడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే విద్యార్థినులు ఆందోళనకు దిగడంతో ఓయూ అధికారులు రక్షణ చర్యలు ముమ్మరం చేస్తామన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రి సమయాల్లో మహిళా గార్డులను ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేస్తామన్నారు. ఆ మేరకు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.