ఓయూ పీజీ పరీక్షలు : రీషెడ్యూల్ ఇదే... అక్టోబర్ 27 నుంచి నవంబర్ 1 వరకు...
భారీ వర్షాల కారణంగా ఈ నెల 19 నుంచి జరగాల్సిన ఉస్మానియా యూనివర్సిటీ(OU) చివరి సెమిస్టర్ పరీక్షలు వాయిదాపడ్డ సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజా రీషెడ్యూల్ను ఓయూ ప్రకటించింది. వాయిదాపడ్డ పరీక్షలను ఈ నెల 27 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. నిజానికి ఈ నెల 22,23 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని ముందుగా భావించినప్పటికీ... తాజాగా ఆ పరీక్షలను కూడా రీషెడ్యూల్ చేశారు. దీంతో వచ్చే మంగళవారం(అక్టోబర్ 27) నుంచి నవంబర్ 1 వరకు వరుసగా ఐదు రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి.
సీపీఈజీటికి ఆలస్య రుసుం లేకుండా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించే గడువును ఈ నెల 23 వరకు పొడగించినట్లు కన్వీనర్ కిషన్ వెల్లడించారు. ఆలస్య రుసుం రూ.500తో ఈ నెల 29 వరకు,రూ.2వేల ఆలస్య రుసుముతో నవంబర్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ,కాకతీయ యూనివర్సిటీ,తెలంగాణ యూనివర్సిటీ,పాలమూరు యూనివర్సిటీ,శాతవాహన యూనివర్సిటీల్లో ఎంఏ,ఎంకాం,ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నవంబర్ 6న సీపీజీఈటీ పరీక్ష జరగనుంది.
కాగా,కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందిపడకుండా... సొంత జిల్లాల్లోనే పరీక్షలు రాసుకునే వెసులుబాటును వర్సిటీ కల్పించింది. కరోనా ఎఫెక్ట్తో చాలామంది హైదరాబాద్లో హాస్టళ్లు,గదులు ఖాళీ చేసి వెళ్లిపోయిన నేపథ్యంలో... వారికి జిల్లాల్లోనే పరీక్షలు రాసే అవకాశం కల్పించింది. ఓయూ చరిత్రలో తొలిసారి వర్సిటీ పరిధి దాటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఓయూ పరిధిలో 90 పరీక్షా కేంద్రాలతో పాటు ఈసారి కొత్తగా మరో 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే వేరే వర్సిటీల పరిధిలోనూ 12 కేంద్రాలను ఎంపిక చేశారు.