హైకోర్టు సీజే ఎదుట ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాశీం, విద్యార్థి నేతల ఆందోళన, విడుదలకు డిమాండ్
మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ చింతకింది కాశీంను పోలీసులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. శనివారం కాశీం ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి హర్డ్ డిస్క్, పుస్తకాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసింది. కాశీంను అరెస్ట్ చేయడంపై పౌర హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించడంతో.. ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. తమ ముందు కాశీంను హాజరుపరచాలని మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం బంజరాహిల్స్ రోడ్ నెంబర్ 7లో గల జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ఇంటి వద్ద పోలీసులు హాజరుపరిచారు.
ఇవీ వాదనలు..
పిటిషనర్ తరఫున వాదనలు వినిపించేందుకు రఘునాథ్, చిక్కుడు ప్రభాకర్, కాశీం భార్య స్నేహలతను పోలీసులు అనుమతించారు. ఐదేళ్ల నాటి కేసులో అరెస్ట్ చేయడం తగదని కాశీం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కాశీం ఇటీవలే విప్లవ రచయితల సంఘం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే అతడిని అరెస్టవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విడుదలకు డిమాండ్
కాశీం వెంటనే విడుదల చేయాలని ఓయూ విద్యార్థులు హైకోర్టు సీజే ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. వీరికి ప్రజాసంఘాలు కూడా తోడయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు భారీ బలగాలను మొహరించి... పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
ఇదీ కేసు..
కాశీం వద్ద మావోయిస్టుల సాహిత్యం ఉందని 2016లో సిద్దిపేట జిల్లా ములుగు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఆ కేసులో సెర్చ్ వారెంట్తో శనివారం గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో 15 మంది పోలీసులు ఓయూలోని కాశీం ఇంటి వద్ద సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి సోదాలు నిర్వహించి.. కీలకపత్రాలు, కంప్యూటర్ హర్డ్ డిస్క్, సాహిత్యం, కరపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కాశీంపై ఐపీసీ 120 (బీ) నేరపూరిత కుట్ర, 121 (ఏ), 124 (ఏ), ఉపా చట్టం కింద కేసులు నమోదు చేశారు.
భయందోళన
పోలీసులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని కాశీం భార్య స్నేహలత పేర్కొన్నారు. గడ్డపారతో తలుపులు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారని చెప్పారు. దీంతో తాము, పిల్లలు భయభ్రాంతులకు గురయ్యాయన్నారు. ఐదేళ్ల క్రితం నాటి కేసులో ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏంటి అని ఆమె ప్రశ్నించారు. తన భర్తను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.