మావోలతో లింక్ అంటూ ఉస్మానియా ప్రొఫెసర్ కాసింను అరెస్టు చేస్తారా?
హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలతో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ప్రొఫెసర్ సి. కాశింను అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన హైదరాబాదులోని నిజాం కాలేజీలోపనిచేస్తున్నారు. ఆయనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద కేసు నమోదు చేశారు.
ఆదిలాబాద్కు చెందిన మావోయిస్టు కొరియర్ శ్యాంసుందర్రెడ్డిని అరెస్ట్ చేసిన గజ్వేల్ పోలీసులు అతని దగ్గర ఉన్న కాల్డేటా ఆధారంగా కాశింకు కూడా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఒకటిరెండు రోజుల్లో ప్రొఫెసర్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాశిం నడుస్తున్న తెలంగాణ అనే పత్రికకు సంపాదకుడిగా ఉన్నారు. అంతేకాకుండా విప్లవ రచయితల సంఘం (విరసం) ఎగ్జెక్యూటివ్ సభ్యుడు కూడా.
మావోయిస్టు సానుభూతి పరుడు శ్యాంసుందర్రెడ్డి ములుగు పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఈ విషయాన్ని సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్ గురువారం మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం - శ్యాంసుందర్రెడ్డి ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం మామిడి గట్టు గ్రామానికి చెందినవాడు. 20 ఏళ్లుగా పీపుల్స్వార్ సిద్ధాంతాలకు ఆకర్శితుడై కొరియర్గా పనిచేస్తున్నాడని వివరించారు.
అప్పటి ఆదిలాబాద్ జిల్లా నాయకుడైన ఒగ్గు సత్వాజీ అలియాస్ సుధాకర్, పుల్లూరు ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న అలియాస్ ఆత్రం, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, బండి ప్రకాశ్ అలియాస్ క్రాంతిలకు ఇతడు కొరియర్గా వ్యవహరించాడని చెప్పారు.
2004లో పీపుల్స్వార్ సీపీఐ మావోయిస్టు పార్టీగా ఆవిర్భవించిందని, దీన్ని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయని చెప్పారు. చంద్రన్న అలియాస్ ఆత్రం ఇప్పటికీ కేంద్రకమిటీ సభ్యుడిగా ఉన్నారని, ఇతడికి శ్యాంసుందర్రెడ్డి ఉత్తరాలు, పెన్డ్రైవ్, మెమెరీకార్డుల ద్వారా సమాచారాన్ని చేరవేసేవాడన్నారు. ఈ సందర్భంగానే ఆయన కాసిం గురించి చెప్పారు.