పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పిండ ప్రధానం..! ఓయూ విద్యార్థుల వింత నిరసన..!!
హైదరాబాద్ : ఓయూ లో మళ్లీ రాజకీయ అలజడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుకు వినూత్న తరహాలో నిరసన తెలిపారు విద్యార్థులు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ, నిరుద్యోగ జేఏసీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయాలపై మండిపడ్డారు. పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వినూత్న పద్దతిలో నిరసన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్ జంప్ అయిన 12 ఎమ్మెల్యేలకు, హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లోని ల్యాండ్ స్కేప్ గార్డెన్ లో ఈ మధ్యాహ్నం 3.30 గంటలకు పిండ ప్రధానం చేసారు.
పార్టీ మారి టీఆర్ఎస్ లో సీఎల్పీని విలీనం చేయాలని స్పీకర్ ను కోరడంపై వారు మండిపడ్డారు. కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో కలవడం అనైతికం అని ,సీఎల్పీ విలీనాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇది ప్రజాస్వామ్య విలువలను దిగజార్చే చర్య అని విమర్శించారు. 'తూ.. మీ బతుకు చెడ. మీరు బ్రతికున్నా చచ్చినట్లే' అని తీవ్రంగా విమర్శించారు.
సమాజానికి మేలు చేయకపోయినా పర్లేదు కీడు చేయకూడదు. తాత్కాలిక ప్రయోెజనాల కోసం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడితే దాని ఫలితాలు ప్రమాదకరంగా ఉంటాయి. 88 సీట్లు గెలిచి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రశేఖర్ రావు, కేవలం తన కొడుక్కి మంచి భవిష్యత్తు ఉండాలంటే ప్రత్యర్థి ఉండకపోతే చాలు అన్న గుడ్డి సూత్రంతో ముందుకెళ్తున్నాడని టీపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ని చంపేస్తే ఇంకో పార్టీ పుడుతుంది, ఆ పార్టీని చంపేస్తే ఇంకో పార్టీ వస్తుంది... ఎన్నింటిని చంపగలగరు? కొడుకు రామారావుకి ఎన్నికలను ఎలా గెలవాలో నేర్పాల్సింది పోయి ప్రత్యర్థి లేకుండా చేయడం అనే ఒక సిల్లీ ప్రయత్నం చేయడం చంద్రశేఖర్ రావు మూర్ఖత్వమని ఉత్తమ్ మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మూడింటి రెండువంతులు అంటే 12 మంది ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరిపోవడంతో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ లో విలీనం అయినట్టు ప్రకటించడం అప్రజాస్వామికం అని ఉత్తమ్ మండి పడ్డారు.