ఓయూలో రాహుల్ సదస్సుకు వీసీ అనుమతి నిరాకరణ, హైకోర్టుకు విద్యార్థులు
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సభకు వైస్ ఛాన్సులర్ నిరాకరించారు. ఈ నెల 13, 14వ తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఓయూలో సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది.
ఉస్మానియా సదస్సులో రాహుల్ పాల్గొనేలా తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావించారు. ఇందుకోసం అనుమతి కోరగా శుక్రవారం వీసీ నిరాకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో సదస్సుకు అనుమతి నిరాకరించారు. పలువురు ఓయూ విద్యార్థులు హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
రాహుల్ గాంధీ ఈ నెల 13 14న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న ఉస్మానియా యూనివర్శిటీలో ఓ సెమినార్లో రాహుల్ పాల్గొనేలా కాంగ్రెస్ ప్లాన్ చేసింది.
అయితే, రాహుల్ పర్యటన సందర్భంగా విద్యార్థులు రెండుగా విడిపోయారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని భావిస్తున్న విద్యార్థులు ఒక గ్రూపుగా ఉంటే, టీఆర్ఎస్కు మద్దతుగా నిలిచే విద్యార్థులు మరో గ్రూపుగా తయారయ్యారు. వీరు ఉస్మానియాకు రాహుల్ రాకుండా అడ్డుకునేందుకు రంగం సిద్ధం సిద్ధమయ్యారు.
కొందరు విద్యార్థులు రాహుల్ను రానీయవద్దని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. యూనివర్సిటీలో రాజకీయ నేతల ప్రసంగాలు అనుమతించకూడదని ఉన్నతస్థాయి నిర్ణయం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓయూ వీసీ అనుమతి నిరాకరించారు.