సంకటంలో కేసీఆర్ సర్కార్: రోడ్డెక్కిన ఫ్రంట్లైన్ వారియర్స్: నినాదాల హోరు: గాంధీలో బాయ్కాట్
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి, ఈ మహమ్మారి బారిన పడిన పేషెంట్ల ప్రాణాలను నిలపడానికి నిరంతరాయంగా కృషి చేస్తోన్న ఫ్రంట్లైన్ వారియర్లు రోడ్డెక్కారు. తెలంగాణలోనే అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రిగా గుర్తింపు పొందిన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పనిచేస్తోన్న ఔట్సోర్సింగ్ సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు.. మూకుమ్మడిగా నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
కొద్దిరోజుల కిందటే గాంధీ ఆసుపత్రి జూనియర్ డాక్టర్లు ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. కరోనా వైరస్ పేషెంట్ల దాడులకు నిరసనగా జూడాలు రోడ్డెక్కగా.. ఈ సారి ఫ్రంట్లైన్ వారియర్లు తమ వారి బాటలో నడుస్తున్నారు. తమ వేతనాలను పెంచాలని, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్రోడ్స్ మార్గంపై బైఠాయించారు. వాహనాలను రాకపోకలను అడ్డుకున్నారు.
గాంధీ ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పాడ్డారు. మెరుపు సమ్మెకు దిగారు. గాంధీ ఆసుపత్రిలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన విధులను నిర్వర్తిస్తోన్న నర్సులు, ఇతర సిబ్బంది సుమారు 800 మంది వరకు ఈ ధర్నాలో పాల్గొన్నారు. తమ విధులను బహిష్కరించారు. ఫలితంగా గాంధీఆసుపత్రిలో వైద్య సేవలు స్తంభించిపోయాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ వారంరోజులుగా ధర్నా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, అందుకే విధులను బహిష్కరించాల్సి వచ్చిందని అంటున్నారు.
కరోనా వ్యాప్తి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో తాము ప్రాణాలకు తెగించి, కుటుంబాలకు దూరంగా ఉంటూ పేషెంట్లకు సేవలను అందిస్తున్నామని అన్నారు. ఇంతా చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం తమను గుర్తించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత తమ ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తామని భరోసా ఇచ్చిన ప్రభుత్వం.. ఇన్నేళ్ల తరువాత కూడా దాని ఊసే ఎత్తట్లేదని ఆరోపిస్తున్నారు. కరోనా వ్యాప్తి తరువాత కొత్తగా నియమించుకున్న నర్సులకు భారీగా జీతాలను చెల్లిస్తోన్న ప్రభుత్వం.. ఏళ్ల తరబడి సేవలను అందిస్తోన్న తమ వేతాలను పెంచకపోవడం సరికాదని మండిపడుతున్నారు.