స్మిత సబర్వాల్పై ఔట్లుక్ కథనం ప్రైవేట్ది కాదు: హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కార్యాలయ అదనపు కార్యదర్శి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్పై ఔట్లుక్ పత్రిక ప్రచురించిన కార్టూన్, కథనాలను ప్రైవేటు వ్యవహారంగా భావించడం లేదని ఉమ్మడి హైకోర్టు తెలిపింది.
ఆమెను ఒక తల్లిగా, ఒకరి భార్యగా, ఒక కూతురుగా కథనంలో ప్రచురించినట్లు లేదని, ఒక ఐఏఎస్ అధికారిగా కథనంలో పేర్కొన్నందున అది స్మితా సబర్వాల్కు మాత్రమే సంబంధించిన వ్యవహరం కాదని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి భోసలే, న్యాయమూర్తి ఎస్వీ భట్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది.
స్మితాసబర్వాల్ను అవమానించేలా ఔట్లుక్ ప్రచురించిన కథనంపై న్యాయపోరాటం కోసం ప్రభుత్వం ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షలు కేటాయించడాన్ని సవాలుచేస్తూ కే ఈశ్వర్రావు అనే ఉద్యోగి దాఖలుచేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
సున్నితమైన ఈ అంశంపై ఇన్కెమెరా (ఛాంబర్ లేదా గదిలో) ద్వారా విచారణ చేపట్టాలన్న అడ్వకేట్ జనరల్ కె. రామకృష్ణారెడ్డి అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఛాంబర్లోనే విచారించింది. ఇదే అంశంపై మరో వ్యాజ్యం దాఖలైనందున రెండింటిని కలిపి సోమవారం విచారించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.