మెట్రో వీకెండె అదుర్స్: కిక్కిరిసిన రైళ్లు, సండే 1.25లక్షలు, ‘బస్సుకన్నా దారుణం?’
హైదరాబాద్: నగరంలో మెట్రో రైలు ప్రారంభం నాటి నుంచే ప్రజలు మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు ఎంతో ఆసక్తికనబర్చారు. గత ఆదివారమైతే హైదరాబాద్లో మెట్రో రైళ్లు మరోసారి ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
మిగతా రోజుల్లోనూ ప్రయాణికుల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ.. శని, ఆదివారాల్లో ఇంకా ప్రయాణికుల తాకిడి లక్షకుపైగా ఉంటుండటంతో మెట్రోకు భారీ ఆదాయమే సమకూరుతోంది. ఛార్జీల గురించి ఏమాత్రం పట్టించుకోని నగరవాసులు మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకే ఆసక్తి చూపుతున్నారు.
సండే వచ్చిదంటే.
ఈ ఆదివారం ఒక్క రోజే 1.25 లక్షల మంది మెట్రోలో ప్రయాణించినట్టు ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అయితే సాధారణ రోజుల్లో మాత్రం మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతున్నట్లు తెలుస్తోంది.
25లక్షల మంది ప్రయాణం
నవంబర్ 29న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మెట్రో రైలు ప్రారంభమైంది. ఇప్పటి వరకు(26రోజుల్లో) 25 లక్షల మంది ప్రయాణించారు. సగటున ప్రతి పది నిమిషాలకో రైలును నడుపుతున్నారు. మియాపూర్-అమీర్పేట, నాగోల్-అమీర్పేట కారిడార్లలో రైళ్లు నడుస్తున్నాయి.
వేగం లేని ప్రయాణం
ప్రయాణం మంచి అనుభూతినే ఇస్తున్నా రైలు వేగం మాత్రం మరీ దారుణంగా ఉందని ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 27.6 కిలోమీటర్ల దూరానికి గంటకుపైగా సమయం పడుతోందని చెబుతున్నారు. విపరీతమైన ట్రాఫిక్ ఉన్న సమయాల్లో బస్సులోనూ ఇంత సమయం పట్టడం లేదని అంటున్నారు.
వేగం పెంచుతాం
అయితే సాంకేతిక సమస్యల కారణంగానే ప్రస్తుతం మెట్రో రైలు వేగాన్ని తగ్గించి నడుపుతున్నామని, త్వరలోనే వాటిని అధిగమించి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో నడుపుతామని మెట్రో అధికారులు పేర్కొన్నారు.