తెలంగాణా సర్కార్ కు లిక్కర్ దరఖాస్తుల కిక్ .. పోటాపోటీగా దరఖాస్తులు
తెలంగాణలో మద్యం షాపుల టెండర్లకు విపరీతమైన స్పందన వచ్చింది. తెలంగాణా సర్కార్ ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. బుధవారం రోజు దరఖాస్తుల దాఖలుకు గడువు ముగిసింది. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పంటపండింది. ఖజానాకు భారీగా కాసుల వర్షం కురిసింది.
తెలంగాణలో మద్యం షాపుల లైసెన్సుకు దరఖాస్తుల వెల్లువ
చివరి రోజైన బుధవారం నాడు రాత్రి పది గంటల వరకు క్యూలో నిలబడి మద్యం షాపుల లైసెన్స్ కొరకు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితంగా దరఖాస్తు రూపంలో ఎక్సైజ్ శాఖకు దాదాపు 900 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 2,216 మద్యం షాపులకు ఇప్పటివరకు 45 వేల దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ దరఖాస్తులతో ప్రభుత్వానికి రూ.900 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం ఒక్కరోజే 20 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. గత సంవత్సరం కన్నా అదనంగా రూ. 470 కోట్ల ఆదాయం పెరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
టాప్ ప్లేస్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా
అన్ని జిల్లాల కంటే ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక దరఖాస్తులు వచ్చాయి. వరంగల్ లో 261 దుకాణాలకు గాను, 2,534 దరఖాస్తులు వచ్చాయి. ఇక హైదరాబాద్లో 173 మద్యం దుకాణాలకు గాను 1,319 దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అతి తక్కువ దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. చాలా చోట్ల మహిళలు పోటీ పడి మరీ మద్యం షాపుల కోసం టెండర్లు వేశారు.
దరఖాస్తు ఫీజు రెండు లక్షలు చేసినా తగ్గని మద్యం వ్యాపారులు
2017 లో 50 వేల రూపాయలుగా ఉన్న దరఖాస్తు ఫీజు లక్ష రూపాయలకు పెంచారు.ఇక తాజాగా లక్ష రూపాయలు గా ఉన్న దరఖాస్తు ఫీజును రెండు లక్షలు చేయడంతో దరఖాస్తులు తగ్గుతాయేమో అని భావించారు . కానీ అనూహ్యంగా దరఖాస్తులు వెల్లువెత్తటంతో ప్రభుత్వానికి 470 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని తెలుస్తుంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఈసారి తెలంగాణా రాష్ట్రంలో లిక్కర్ షాపులకు ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రం నుండి చాలా మంది మద్యం వ్యాపారులు టెండర్లు వేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటె ఏపీలో ప్రభుత్వం సర్కార్ మద్యం షాపులు నిర్వహిస్తున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ నెల 18న లాటరీ పద్ధతిలో లిక్కర్ షాపుల కేటాయింపు
ఇక ఈ లిక్కర్ షాపుల టెండర్లను ఈ నెల 18న లాటరీ పద్ధతిలో కేటాయించనుంది ప్రభుత్వం. అయితే ఏపీకి చెందిన వ్యాపారస్తులు తెలంగాణలో మద్యం షాపులను దక్కించుకోవడానికి బంధువులు,స్నేహితుల ద్వారా టెండర్లు వేసినట్లు తెలుస్తోంది.ఏపీలో కొత్త పాలసీ ప్రకారం మద్యం వ్యాపారుల ఆగడాలకు చెక్ పెట్టింది ఏపీ ప్రభుత్వం . ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో తమ వ్యాపారాన్ని కొనసాగించాలని ఏపీ మద్యం వ్యాపారస్తులు ప్రయత్నిస్తున్నారు.అందులో భాగంగానే భారీగా లిక్కర్ షాప్ లకు టెండర్లు వేసినట్లు తెలుస్తోంది.