డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి: మజ్లిస్ ఎమ్మెల్యే బలాలా అరెస్ట్, వెంటనే బెయిల్
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంట్లోకి ప్రవేశించడం, కొడుకు పైన దాడికి పాల్పడటంతో మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే మహమూద్ బలాలాను పోలీసులు మంగళవారం నాడు అరెస్టు చేశారు. తొలుత ఉప ముఖ్యమంత్రి పైన చేయి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయన తనయుడి పైన బలాలా చేయి చేసుకున్నారు.
ఎమ్మెల్యే అహ్మద్ బలాలాను పోలీసులు బుధవారం ఉదయం బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. బలాలాను కోర్టుకు తరలించడంతో మజ్లిస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
బలాలాకు బెయిల్ మంజూరు
పోలీసులు బుధవారం ఉదయం నాంపల్లి న్యాయస్థానంలో ఎమ్మెల్యే బలాలాను హాజరుపరిచారు. ఆ వెంటనే అతను నాంపల్లి కోర్టు నుంచి బెయిల్ పొందారు.
మరోవైపు, మీర్ చౌక్ పోలీస్ స్టేషన్లో షబ్బీర్ అలీ ఫిర్యాదు, ఓ జర్నలిస్ట్ పైన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దాడికి పాల్పడడ్డారనే ఫిర్యాదుతో ఆయన పైన కేసు నమోదు చేశారు.
జర్నలిస్ట్ పైనా దాడి
పురానీహవేలీ ఛత్తబజార్ సమీపంలో మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ ఉర్దూ పత్రిక పాత్రికేయుడిపై మజ్లిస్ పార్టీ నేతలు మంగళవారం దాడి చేశారు. బాధితుడు, మీర్చౌక్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. పాత నగరంలో పోలింగ్ వార్తల సేకరణ కోసం వస్తున్న ముబషీరుద్దీన్(36)ని చూసి ద్విచక్ర వాహనాలపై వెళుతున్న మజ్లిస్ నేత మరికొందరు గట్టిగా కేకలు వేశారు.
అతడిపై దాడికి పాల్పడ్డారు. అసద్ సూచనల మేరకే మజ్లిస్ నేతలు, కార్యకర్తలు తనపై దాడి చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మీర్చౌక్ ఎస్సై రంగారెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.