ఓవైసీ vs బిపిన్ రావత్: పెహ్లూఖాన్ను చంపిన వారిని ఎవరు మారుస్తారు..?
Recommended Video
హైదరాబాద్: తీవ్రవాద మూలాలున్న యువతను ప్రత్యేక క్యాంపులకు తరలించాలని సూచనలు చేసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్కు సూటి ప్రశ్న వేశారు మజ్లిస్ నేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. గతంలో అఖ్లఖ్ మరియు పెహ్లూ ఖాన్లను చంపిన వారిని ఎక్కడ పెడతారు అని ప్రశ్నించారు ఓవైసీ. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. గురువారం రోజున ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడారు. ఆ సందర్భంగా కశ్మీర్లో 10 ఏళ్లు 12 ఏళ్ల చిన్నారులను తీవ్రవాదులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
పౌర విధానాలను ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి..జనరల్ కాదు
తీవ్రవాద మూలాలు కలిగి ఉన్న యువతను గుర్తించి వేరే క్యాంపుల్లో పెట్టాలని బిపిన్ రావత్ చెప్పిన కొన్ని గంటల్లోనే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూటి ప్రశ్న వేశారు. రాడికల్ భావజాలాలు ఉన్న వారు, వారి వెనక ఉన్న రాజకీయనేతలను ప్రత్యేక క్యాంపులకు తరలించాలని సూచించిన బిపిన్ రావత్... పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న అస్సాంలోని బెంగాల్ ముస్లింల పరిస్థితేంటని ఓవైసీ ప్రశ్నించారు. విధానాలను ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి తప్ప ఒక జనరల్ కాదని పరోక్షంగా చురకలంటించారు ఓవైసీ. ప్రభుత్వంలోని పాలసీలు, రాజకీయాలపై ఒక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం సరికాదన్నారు. అంతేకాదు పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకించడంలో మజ్లిస్ పార్టీ అన్ని పార్టీలకంటే ముందుందని గుర్తుచేశారు.
చిన్నారుల్లో రాడికల్ భావజాలాలు
ఇక రాడికలైజేషన్ పై మాట్లాడిన జనరల్ బిపిన్ రావత్... చిన్నపిల్లలకు స్కూళ్లు, యూనివర్శిటీలు, మతపరమైన స్థలాల్లో రాడికలైజేషన్ గురించి చెబుతున్నారని అన్నారు. కొన్ని రాడికలైజ్డ్ సంస్థలు ఇలాంటివి చిన్నారులకు బోధిస్తున్నాయని చెప్పారు బిపిన్ రావత్. వారిని గుర్తించి క్రమంగా సమాజం నుంచి దూరం చేయాలని సూచించారు. ఇందుకోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని వెల్లడించారు. ముందుగా రాడికల్ భావజాలాలున్న వ్యక్తులను గుర్తించి ఆ తర్వాత వారి నుంచి ప్రభావమైన పిల్లలను గుర్తించాలని చెప్పారు.
యోగీ ఆదిత్యనాథ్, మీరట్ ఎస్పీలను ప్రత్యేక క్యాంపుల్లో పెట్టాలి
రాడికలైజేషన్ గురించి ప్రస్తావించాల్సి వస్తే ముందుగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, పాకిస్తాన్కు వెళ్లండి అన్న మీరట్ ఎస్పీలను ప్రత్యేక క్యాంపుల్లో పెట్టాలని బిపిన్ రావత్కు సలహా ఇచ్చారు ఓవైసీ. ఎన్పీఆర్-ఎన్సీఆర్లను వ్యతిరేకిస్తున్న వారిపై యోగీ ఆదిత్యనాథ్, మరియు మీరట్ ఎస్పీలు రాడికల్ భావజాలంతో మాట్లాడారని గుర్తుచేశారు ఓవైసీ.
బిపిన్ రావత్ పరిధి దాటి మాట్లాడుతున్నారు: ఓవైసీ
ఆర్మీ చీఫ్గా ఉన్న సమయంలో పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న వేళ నిరసనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనరల్ బిపిన్ రావత్. విద్యార్థుల వెనక, నిరసనకారుల వెనక విపక్షాలకు చెందిన రాజకీయనాయకులు ఉన్నారని ఆ సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు జనరల్ బిపిన్ రావత్. అప్పుడే బిపిన్ వ్యాఖ్యలకు ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. బిపిన్ రావత్ రాజకీయనాయకుడు కాదని తన పరిధి ఏమిటో తెలుసుకుని వ్యవహరిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు ఓవైసీ.