పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ.. పార్టీలో చేరిన 10 రోజులకే... ఇక హుజురాబాద్ బరిలో ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్?
ఇటీవలే టీఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని రాష్ట్ర కేబినెట్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేసింది. ఆదివారం(అగస్టు 1) జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం జరగ్గా... ఈ మేరకు కౌశిక్ రెడ్డి పేరును గవర్నర్ తమిళిసైకి సిఫారసు చేశారు. గత నెల 21న కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరగా... ఆయనకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే ఎమ్మెల్సీ పదవితో ఆయకు బంపర్ ఆఫర్ ఇచ్చారు.కేబినెట్ నిర్ణయంపై కౌశిక్ రెడ్డితో పాటు ఆయన మద్దతుదారుల్లో సంతోషం నెలకొంది.
ఆ స్థానంలో కౌశిక్ రెడ్డికి పదవి...
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు ఆరు ఉన్నాయి. ఇందులో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన రాములు నాయక్,కర్నె ప్రభాకర్,మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డిల పదవీ కాలం గతేడాది మార్చి,జూన్,అగస్టుల్లో ముగిసింది. దీంతో ఆ స్థానాలకు ప్రజా కవి గోరెటి వెంకన్న,మాజీ ఎమ్మెల్యే బసవరాజు సారయ్య,వైశ్య సామాజికవర్గానికి చెందిన బొగ్గారపు దయానంద్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. గవర్నర్ కోటాలో ఎంపికైన మరో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం జూన్ 16న ముగిసింది. తాజాగా ఆయన స్థానాన్ని కౌశిక్ రెడ్డితో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిఫారసు చేసింది.
హుజురాబాద్ నేతలకు పదవులు,నియోజకవర్గానికి వరాలు...
నిజానికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్గా కౌశిక్ రెడ్డికి అవకాశం ఇవ్వొచ్చునన్న ప్రచారం జరిగింది. అయితే ఏకంగా ఆయన్ను ఎమ్మెల్సీకి నామినేటెడ్ చేయడం టీఆర్ఎస్ పార్టీ వర్గాలనే ఆశ్చర్యానికి గురిచేసింది. హుజురాబాద్ ఉపఎన్నిక వేళ నియోజకవర్గంపై గట్టి ఫోకస్ పెట్టిన కేసీఆర్... ఇప్పటికే అదే నియోజకవర్గానికి చెందిన బండా శ్రీనివాస్కు ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. దళిత బంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అక్కడే అమలుచేయబోతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే ఉపఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారో అర్థమవుతోంది. ఎలాగైనా సరే నియోజకవర్గంలో గెలిచేందుకు ఆయన అన్ని పావులు కదుపుతున్నారు.
Recommended Video
ఆ ఇద్దరిలో ఒకరికి ఛాన్స్..?
కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఖరారు చేయడంతో ఇక హుజురాబాద్ బరిలో బీసీ అభ్యర్థినే బరిలో దింపవచ్చునన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ లేదా ఇటీవలే పార్టీలో చేరిన స్వర్గం రవిలకు అక్కడినుంచి పోటీ చేసే అవకాశం దక్కవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు కాని పక్షంలో మాజీ మంత్రి ఎల్.రమణను బరిలో దింపవచ్చునన్న వాదన కూడా వినిపిస్తోంది. నిజానికి కౌశిక్ రెడ్డికి టికెట్ దక్కవచ్చునన్న ప్రచారం జరిగినప్పటికీ... ఆయన ఆడియో కాల్ లీక్ వ్యవహారంతో అంతా తలకిందులైందన్న వాదన కూడా ఉంది. ఇక ముద్దసాని పురుషోత్తం రెడ్డి,ముద్దసాని మాలతిల పేర్లు కూడా కేసీఆర్ పరిశీలించినప్పటికీ కేసీఆర్ అంతగా సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ఇప్పటికీ అభ్యర్థి అన్వేషణలోనే ఉన్న టీఆర్ఎస్ అనూహ్యంగా కొత్త ముఖాన్ని తెర పైకి తీస్తుందా లేక ఇప్పటికే ఉన్న ఆశావహుల్లో ఒకరికి అవకాశం ఇస్తుందా అన్నది వేచి చూడాలి.