తప్పిన పెనుప్రమాదం!: సేఫ్గా బయటపడ్డ పద్మాదేవెందర్ రెడ్డి
మనోహరాబాద్ చౌరస్తా వద్దకు చేరుకోగానే.. నేషనల్ హైవేపై యూటర్న్ తీసుకుంటున్న ఓ ఆటో.. వేగంగా కాన్వాయ్ వైపు దూసుకొచ్చింది.
మెదక్: తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తృటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వేగంగా యూ టర్న్ తీసుకోబోయిన ఓ ఆటో డ్రైవర్.. కాన్వాయ్కు అడ్డు రావడంతో పద్మాదేవెందర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కాన్వాయ్ లోని మరో కారు బలంగా ఢీకొన్నాయి.
మెదక్ జిల్లా మనోహరాబాద్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చేగుంటలో జరిగే ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి పద్మాదేవెందర్ రెడ్డి తన కారులో బయలుదేరారు.ఇదే క్రమంలో కారు మనోహరాబాద్ చౌరస్తా వద్దకు చేరుకోగానే.. నేషనల్ హైవేపై యూటర్న్ తీసుకుంటున్న ఓ ఆటో.. వేగంగా కాన్వాయ్ వైపు దూసుకొచ్చింది.
ఆటోను తప్పించబోయిన ఎస్కార్ట్ వాహన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో.. పద్మా దేవెందర్ రెడ్డి కారు, కాన్వాయ్ లో వెనకాలే వస్తున్న మరో కారు బలంగా ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు ప్రమాదం లో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనానంతరం పద్మాదేవెందర్ రెడ్డిమరో కారులో వివాహా వేడుకకు బయలుదేరారు.
ప్రమాద వార్త తెలియగానే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఫోన్ ద్వారా పద్మాదేవెందర్ రెడ్డిని పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.