డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన పద్మారావు గౌడ్ .. ఉన్నత పదవులు చేపట్టాలన్న సీఎం కేసీఆర్
Recommended Video
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పద్మారావు గౌడ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ స్పీకర్ పదవీకి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్ వేశారు. విపక్ష కాంగ్రెస్ పోటీకి దిగకపోవడంతో .. పద్మారావు గౌడ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. శనివారం డిప్యూటీ స్పీకర్ గా ఆయన ఎన్నిక కాగా .. సోమవారం పదవీ బాధ్యతలను చేపట్టారు. సభా సాంప్రదాయం ప్రకారం పద్మారావు గౌడ్ ను సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రులు తలసాని, వేముల ప్రశాంత్ రెడ్డి స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి .. పద్మారావుకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు.
పద్మారావు ..నిరాండబరుడు
డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన బాధ్యతలు స్పీకరించిన పద్మారావు గౌడ్ కు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. కార్మిక నేతగా మొదలైన రాజకీయ ప్రస్థానం డిప్యూటీ స్పీకర్ వరకు చేరిందన్నారు. భవిష్యత్ లో మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉత్సాహంగా పనిచేశారని చెప్పారు. టీఆర్ఎస్ నిర్వహించిన మొదటిసభను దిగ్విజయం చేసిందని మీరేనని గుర్తుచేశారు. ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని ప్రస్తావించారు. రెండుసార్లు కార్పొరేటర్ గా పనిచేసి నగర అభివృద్ది కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. తొలి తెలంగాణ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని .. గుడుంబాను అరికట్టడంలో కీ రోల్ పోషించారని సమర్థించారు. డిప్యూటీ స్పీకర్ నుంచి మరెన్నో పదవులు చేపట్టేందుకు ఆ భగవంతుడు దీర్ఘాయుష్సు కల్పించాలని కోరుకున్నారు. ఎన్ని పదవులు చేపట్టినా .. ప్రజా సమస్యల కోసం పనిచేసినా .. మీ నిరాడంబరత ఇతర నేతలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు కేసీఆర్.
కార్మిక నేత టు డిప్యూటీ స్పీకర్
సీఎం కేసీఆర్ తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రసంగించారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు కాంగ్రెస్ శాసనసభా పక్షం తరఫున హృదయపూర్వక అభినందలు తెలిపారు. కార్మిక నాయకుని రాజకీయ ప్రస్థానం మొదలైందని గుర్తుచేశారు. 1970 సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఇచ్చిన పేదరిక నిర్మూలన కోసం యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారని ప్రస్తావించారు. కార్మికుల కోసం అహోరాత్రులు శ్రమించారని .. కార్పొరేటర్ నుంచి మంత్రి, డిప్యూటీ స్పీకర్ గా ఎదిగారని తెలిపారు.
నిబద్ధతకు మారుపేరు
పద్మారావు గౌడ్ నిబద్ధతకు మారుపేరని కొనియాడారు మాజీ మంత్రి కేటీఆర్. దశాబ్ధంగా పనిచేసిన అనుభవం మీతో ఉన్నదని .. గతంలో పనిచేసిన విభాగాలకు మంచి పేరు తీసుకొచ్చారని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ పదవీ కూడా వన్నె తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపసభాపతిగా సమర్థంగా విధులు నిర్వహించాలని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.
పద్మం వికసించాలి
ఉద్యమ సహచరుడిగా దశాబ్ధాలుగా కలిసి పనిచేశానని గుర్తుచేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. 2001లో జరిగిన బల్దియా ఎన్నికల్లో మోండా మార్కెట్ నుంచి గెలిచి .. తెలంగాణ వాణిని వినిపించారని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో అప్పటి ఉమ్మడి అసెంబ్లీల దిక్కులు పెక్కటిల్లేలా జై తెలంగాణ అని చేసిన నినాదాలు మరువని పేర్కొన్నారు. ఎక్సైజ్ మంత్రిగా సమర్థంగా పనిచేశారని .. గుడుండా అనే రక్కసిని సమూలంగా నిర్మూలించారని కొనియాడారు. ఉద్యమ సహచరుడిగా, శాసనసభ నేస్తంగా, మంత్రివర్గ సభ్యుడిగా మీతో పనిచేశానని తెలిపారు. సభా ఔన్నత్తం పెరిగేలా పనిచేశారని విశ్వసించారు. పద్మం వికసించినట్టే .. సభలో ఉప సభాపతిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. అలాగే క్రీడలశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే సానియా మీర్జా, సైనా నెహ్వాల్, పీవీ సింధు అంతర్జాతీయ వేదికలపై మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చారని గుర్తుచేశారు.
మంత్రులు, సభ్యుల శుభాకాంక్షలు
డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ కు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, బీజేఎస్పీ నేత రాజాసింగ్, కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.