కుమార్తె నగ్న చిత్రాలను లీక్ చేస్తానని బ్లాక్ మెయిల్: హైదరాబాద్ లో పాకిస్తానీ అరెస్ట్!
హైదరాబాద్: పాకిస్తాన్ కి చెందిన ఓ వ్యక్తి మాయ మాటలతో ఓ భారతీయ మహిళను వివాహం చేసుకోవడమే గాక.. ఆమె కుమార్తె నగ్న వీడియోలు చిత్రీకరించి ఇంటర్నెట్ లో పెడుతానంటూ బ్లాక్ మెయిలింగ్ కి పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడంతో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ ఒంటరి మహిళ కొన్నేళ్ల క్రితం దుబాయ్ వెళ్లింది. పెళ్లయిన కొన్నాళ్లకే ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. 10ఏళ్ల క్రితం దుబాయ్ వెళ్లిన ఆమెకు పాకిస్థాన్ కు చెందిన మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్తో పరిచయం ఏర్పడింది.
తాను పాకిస్తానీ అన్న విషయం దాచిపెట్టి, తనది ఢిల్లీనే అని ఉస్మాన్ ఆమెను నమ్మించి వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఉస్మాన్ పాకిస్తానీ అని తెలియడంతో అతన్ని వదిలి హైదరాబాద్ వచ్చేసింది. ఆ తర్వాత 2011లో ఆమెను వెతుక్కుంటూ ఉస్మాన్ ఇండియా వచ్చాడు. ఆర్నెళ్ల విజిటింగ్ వీసాపై వచ్చానని ఆమె వద్ద కొద్దిరోజులు ఉన్నాడు.
అయితే అతను దుబాయ్ నుంచి నేపాల్ వెళ్లి.. అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా ఢిల్లీకి చేరుకుని, అటునుంచి హైదరాబాద్ వచ్చాడు. ఆ విషయం తెలిసి ఆమె అతన్ని దూరం పెట్టింది. కక్ష పెంచుకున్న అతను ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని బయటపెడుతానంటూ బెదిరించాడు.
బాధిత మహిళ స్నేహితురాలికి ఆ ఫోటోలు పంపించి బెదిరించాడు. దీంతో అతని వేధింపులు తాళలేక బాధితురాలు సీసీఎస్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో ఉస్మాన్ పాస్ పోర్టు వివరాలు తప్పుగా ఉన్నట్టు గుర్తించారు. అబ్బాస్ పేరుతో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి పాస్ పోర్టు తీసుకున్నట్టు గుర్తించారు.
అయితే ఎవరి నుంచి ఈ బోగస్ ధ్రువీకరణ పత్రాలు పొందాడన్నది తెలియాల్సి ఉంది. ఉస్మాన్ భారత్ రావడం వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా? అని కూడా ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ కోసం ఉస్మాన్ ను న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలనుకుంటున్నారు.