కాంగ్రెస్కు మరో షాక్: తుమ్మలపై గెలిచిన ఎమ్మెల్యే టీఆర్ఎస్లోకి, ఖమ్మం ఆశలపై...
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కూటమి అంతో ఇంతా సత్తా చాటింది ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 19 స్థానాల్లో గెలిచింది. ఇందులో ఇప్పటికే నాలుగు వికెట్లు పడ్డాయి. ఆత్రం సక్కు, సబితా ఇంద్రారెడ్డి, రేగా కాంతారావు, హరిప్రియలు తెరాసలోకి వెళ్లారు.. వెళ్తున్నారు. తాజాగా, మరో వికెట్ పడింది.
'కేసీఆర్ను కలిశాక అది సరైనదేననిపించింది': నిన్న సబిత చేతిలో ఓడిన తీగల.. నేడు కలిశారు
కేటీఆర్ను కలిసిన పాలేరు ఎమ్మెల్యే
గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కందల ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. ఆయన గురువారం తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిశారు. కారు ఎక్కేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు కేటీఆర్కు తెలిపారు. త్వరలో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.
తుమ్మలను ఓడించిన ఉపేందర్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్ పైన గెలిచిన ఉపేందర్ రెడ్డి కీలక టీఆర్ఎస్ నేతను ఓడించారు. టీడీపీలో కీలక నేతగా ఎదిగి, ఆ తర్వాత తెరాసలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావును ఓడించారు. దాదాపు ఎనిమిది వేల మెజార్టీతో ఓడించారు. ఉపేందర్ రెడ్డికి 89,407 ఓట్లు రాగా, తుమ్మలకు 81,738 ఓట్లు వచ్చాయి.
పార్లమెంటు ఎన్నికలకు ముందు భారీ షాక్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. అయితే ఆ తర్వాత పార్టీ పుంజుకుందని, కాబట్టి ఈ ఎన్నికల్లో తమ పార్టీ తెరాస కంటే మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వరుసగా ఎమ్మెల్యేలు కారు ఎక్కుతుండటం ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. మిగతా జిల్లాల్లో కంటే ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్, టీడీపీ కూటమి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో టీడీపీ మద్దతుతో ఖమ్మం పార్లమెంటు సీటును ఖాయంగా గెలుచుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది. అందుకే రేణుకా చౌదరి సహా పలువురు నేతలు పోటీ కోసం ఉత్సాహంగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో పాలేరు ఎమ్మెల్యే పార్టీ మారుతుండటం గమనార్హం. ముఖ్యంగా తమకు అనుకూలంగా ఉండే పార్లమెంట్ స్థానాల్లో ఖమ్మం ఒకటి అనుకుంటున్న సమయంలో షాక్ తగిలింది.