పాలేరులో పనిచేయని సానుభూతి: తుమ్మల ఘన విజయం
ఖమ్మం: జిల్లాలోని పాలేరు నియోజక వర్గంకు జరిగిన ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు ఘన విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి ఆధిక్య కనబర్చిన తుమ్మల నాగేశ్వరరావు చివరి రౌండ్ వరకు మెజార్టీని పెంచుకుంటూ పోయారు. కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డిపై 45,650 ఓట్ల భారీ మెజార్టీతో తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు.
బాధ్యత పెంచింది, కేసీఆర్ వల్లే గెలుపు: తుమ్మల కృతజ్ఞతలు
పాలేరు గెలుపుతో మాపై మరింత బాధ్యత పెరిగిందని మంత్రి తుమ్మల అన్నారు. తనను గెలిపించిన పాలేరు నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాలేరు నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలే తనను గెలిపించాయని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.
తొలి రౌండ్ నుంచి తుమ్మల ఆధిక్యం
టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు తొలి రౌండ్ నుంచీ ఆధిక్యం చూపిస్తున్నారు. తొలి రైండ్లో 5,400 ఓట్ల ఆధిక్యం చూపారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపులో 13,810 ఓట్ల ఆధిక్యంతో గెలుపు దిశగా దూసుకుపోతున్నారు.
ఐదు రౌండ్లు పూర్తయ్యే సరికి 18,548 ఓట్ల మెజార్టీతో తుమ్మల ఆధిక్యంలో ఉన్నారు. 6వ రౌండ్లో తుమ్మలకు 23వేల ఓట్ల ఆధిక్యం లభించింది. 9వ రౌండ్ ముగిసే సరికి 27,891 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు తుమ్మల. 10వ రౌండ్ ముగిసే సరికి తుమ్మలకు 33,200 ఓట్ల ఆధిక్యం లభించింది. కాగా, 15వ రౌండ్లో 41,473 ఓట్ల భారీ మెజార్టీతో తుమ్మలు దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ రెండో స్థానంలో, సీపీఎం మూడో స్థానంలో కొనసాగుతుంది. మరో గంటలో పూర్తి స్థాయి ఫలితం వెలువడనుంది.
పని చేయని సానుభూతి
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెకంటరెడ్డి చనిపోవడంతో జరిగిన పాలేరు ఉప ఎన్నికల ఫలితాల్లో ఆ కుటుంబంపై సానుభూతి తమను గెలిపిస్తుందనుకున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సానుభూతి పనిచేయకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలికినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుచరితా రెడ్డి రెండో స్థానానికే పరిమతమయ్యారు.