"రేవంత్కు చిప్పకూడు ఖాయం.. కేటీఆర్ కాలిగోటికి సరిపోవు!"
ప్రాజెక్టులపై అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలే తిరగబడి బుద్ది చెబుతారని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపై లేనిపోని అసత్యాలు ప్రచారం చేస్తే ప్రజలే తరిమికొడుతారని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. మిషన్ భగీరథ గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, ప్రాజెక్టులపై అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలే తిరగబడి బుద్ది చెబుతారని మండిపడ్డారు. కేటీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ సరితూగడని రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
టీఆర్ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన రాజేశ్వర్ రెడ్డి రేవంత్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం కమిషన్ల కోసమే పాలమూరు ఎత్తిపోతల పథకానికి రేవంత్ అడ్డుపడుతున్నారని, ఆయనకు చిప్పకూడు తప్పదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఏడు మండలాలను ధారాదత్తం చేస్తుంటే మాట్లాడని రేవంత్ ఇప్పుడు మాట్లాడుతుండడం అనైతికమన్నారు.
గత పాలకుల హయాంలో తెలంగాణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని.. విద్యా, వైద్యాన్ని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.పేదలకు మెరుగైన విద్యా, వైద్యం, అందిస్తున్నది సీఎం కేసీఆర్ ఒక్కరేనని ఈ సందర్బంగా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం సంక్షేమ పాఠశాలల విద్యార్థులు సన్న బియ్యంతో అన్నం తింటూ చదువుకుంటున్నారని ఇవన్నీ చేసినవి సీఎం కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.
కాగా, తాగి రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ అంతకుముందు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ సమాజాన్ని కించపరిచేవిగా ఉన్నాయని, రోజురోజుకు రేవంత్ మాట తీరు మరింత హీనంగా తయారవుతోందని పలువురు టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే గాదరి కిశోర్ కూడా పాల్గొన్నారు.