'చంద్రబాబు వేసే దానికి కక్కుర్తిపడి, రేవంత్ను ముంచడం ఖాయం'
అసెంబ్లీ నిర్వహణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొత్త ఒరవడి సృష్టించారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గురువారం అన్నారు.
హైదరాబాద్: అసెంబ్లీ నిర్వహణలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కొత్త ఒరవడి సృష్టించారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి గురువారం అన్నారు. సమావేశాలు ప్రజలకు ఆశలు కల్పిస్తే, ప్రతిపక్షాలకు నిరాశ కల్పించాయన్నారు.
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకూడదని రేవంత్ రెడ్డి పాలసీగా పెట్టుకున్నారన్నారు. తాము ప్రాజెక్టులు నిర్మించడం ఖాయమని, అందులో రేవంత్ రెడ్డిని ముంచడం ఖాయమన్నారు.
రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు వేసే బొక్కల కోసం కక్కుర్తిపడి మాట్లాడటం మానుకోవాలన్నారు. కందులకు గిట్టుబాటు ధర కల్పించడం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం శాసన సభ సమావేశాలను విజయవంతంగా నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రశాంత వాతావరణంలో చర్చ జరిగిందన్నారు. సభలో ఎన్నో విషయాలు చర్చించామన్నారు.
ప్రతిపక్షాల కంటే ప్రభుత్వమే ప్రజా సమస్యలపై చర్చించాలని బీఏసీలో కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్తోపాటు పలు అంశాలపై సభలో చర్చ జరిగిందన్నారు.
ప్రతీ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేశారని తెలిపారు. ప్రజా సమస్యలపై చర్చిస్తుంటే ప్రతిపక్షాలే సభ నుంచి పారిపోయాయన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఇలా జరగాలని దేశానికి మార్గదర్శనం చేసిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
సమావేశాలు ప్రజలకు ఆశలను కల్పిస్తే ప్రతిపక్షాలకు నిరాశను కలిగించాయన్నారు. ప్రతిపక్షాలు నిరాశకు గురయ్యాయంటే ప్రజా సమస్యలు తొలగినట్టేనన్నారు. ప్రతిపక్షాలకు తెలంగాణ అభివృద్ధిని గురించి సీఎం కేసీఆర్ వివరించారన్నారు. సభ నిర్వహణను విపక్షాలు సైతం మెచ్చుకున్నాయన్నారు.