'పనామా'లో తెలుగువాళ్లు: 'సంబంధంలేదు, పని చేయట్లేదు'
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన 'పనామా పేపర్స్' తెలుగు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసింది. పనామా పేపర్స్లో ముగ్గురు తెలుగువాళ్ల పేర్లు తెరమీదకు రావడం గమనార్హం. ఇది తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. దీనిపై వారు వివరణ ఇచ్చారు.
పనామా జాబితాలో ఉన్నవారిలో హైదరాబాద్ వ్యాపారి మోటూరి శ్రీనివాస్ ప్రసాద్ కనీసం నాలుగు విదేశీ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నట్టు పనామా పత్రాల ద్వారా వెల్లడైంది. 2011లో బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లో ఈ కంపెనీలు నమోదయ్యాయి. నందన్ క్లీన్టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ప్రసాద్ సికా సెక్యూరిటీస్ లిమిటెడ్కు కో-ఓనర్గా కొనసాగుతున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద బయోడీజెల్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పిన ప్రసాద్ పేరిట మరో 12 కంపెనీలు ఉన్నాయి. బయోడీజిల్ ఎగుమతుల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై 2012లో అరెస్టయి బెయిలుపై విడుదలయ్యారు. పనామా జాబితా నేపథ్యంలో తనకు వివాదాస్పద లావాదేవీలు ఏవీలేవని ప్రసాద్ ఖండించారు.
విదేశాల్లో వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో వన్ డాలర్ ఆఫ్షోర్ కంపెనీలు ప్రారంభించామని, తర్వాత వాటిని మూసివేశామన్నారు. పనామా పేపర్లలో వచ్చిన మరో బిజినెస్మెన్ ఓలం భాస్కర రావు స్వస్థలం వరంగల్. ఆయన కూడా ఆరోపణలను కొట్టిపారేశారు.
తన తండ్రి రిటైర్ అయినప్పటి నుంచి ఆ కంపెనీలను మోటూరి శ్రీనివాస్ ప్రసాద్ చూస్తున్నారని, నాలుగేళ్ల కింద ఆ కంపెనీలను స్థాపించారని, అనుమతులు.. నిర్వహణ కోసం పెట్టుబడులు భారీగా పెట్టాల్సి వచ్చిందని ఓలం భాస్కర రావు చెప్పారు.
మరో వ్యాపారవేత్త భావనాశి జయకుమార్ పేరు కూడా జాబితాలో ఉంది. ఈయన పేరు మీద నందన్ టెక్నాలజీస్, ఎస్డీ వెంచర్స్, గ్రాండ్బే కెనాల్ తదితర కంపెనీలున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రసాద్, వోలం భాస్కరరావుతో కలిసి ఈ కంపెనీల్లో జయకుమార్ డైరెక్టర్గా ఉన్నారు. నందన్ టెక్నాలజీస్ను 2008లో, గ్రాండ్బే కెనాల్ను 2015లో స్థాపించారు. నందన్ టెక్నాలజీస్ సబ్సిడరీలైన ఆరు కంపెనీల్లోనూ ఈయన డైరెక్టర్గా ఉన్నారు.
ఈ ఆఫ్షోర్ కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని జయకుమార్ స్పష్టం చేశారు. ఈ కంపెనీలు ఓలం భాస్కర రావు ఎండీగా నిర్వహిస్తున్నారన్నారు.
నందన్ టెక్నాలజీస్, దాని అనుబంధ కంపెనీలు ఆరింటికి ఎండీగా, సికా సెక్యూరిటీస్కు సహ యజమానిగా, నందన్ క్లీన్టెక్కు ప్రమోటర్గా, 2008 నుంచి ఎండీగా ఉన్న భాస్కర రావు ప్రస్తుతం వ్యాపారాల నుంచి రిటైర్మెంటు తీసుకున్నారు. ఎక్కువగా బ్రిటన్లో గడుపుతున్నారు. అయితే ఈ కంపెనీలేవీ ప్రస్తుతం పని చేయడం లేదని, పద్ధతి ప్రకారమే వాటిని ఏర్పాటు చేశామంటున్నారు.
ఇదిలా ఉండగా, పనామా పేపర్స్లో 500 మంది భారతీయుల పేర్లు వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీటిని విచారించేందుకు మల్టీ ఏజెన్సీ టీంలను రంగంలోకి దింపనుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ రెండు రోజుల క్రితం వెల్లడించారు.