పంచాయతీకి వారంలో ముహుర్తం.. 3 దశల్లో పోలింగ్
Recommended Video
హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు జనవరిలోపు నిర్వహించాలనే హైకోర్టు ఆదేశాలతో దానికి సంబంధించిన ప్రక్రియ ఊపందుకుంది. ఈమేరకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. అయితే మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు అధికారులు.
3 దశల్లో పోలింగ్.. విడతకు 18 రోజులు
తెలంగాణ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వేగవంతం చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మరో వారంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఒక్కో విడతకు 18 రోజుల షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. షెడ్యూల్ జారీకి సంబంధించి పంచాయతీ రాజ్ చట్టం - 2018 లో పొందుపరిచిన నిబంధనలను అనుసరించనున్నట్లు సమాచారం.
నామినేషన్ల ప్రక్రియ ఏంటంటే..!
ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేశాక మూడు రోజుల తర్వాత వారం పాటు నామినేషన్లు స్వీకరించనున్నారు. అంటే 4వ రోజు నుంచి 10వ రోజు వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈ సమయంలో ఒకవేళ సెలవు దినాలున్నా.. నామినేషన్లు తీసుకుంటారట. ఇక ఆ ప్రక్రియ ముగిసిన మరుసటి రోజు వాటిని స్క్రూటినీ చేయనున్నారు. దాని తర్వాత మూడు రోజుల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల విత్డ్రా ప్రక్రియ ముగిసిన వెంటనే ఎన్నికల బరిలో నిలిచే సర్పంచ్, వార్డు సభ్యుల ఫైనల్ లిస్ట్ ఖరారు కానుంది. అదలావుంటే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన 5వ రోజు తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశముంది. పోలింగ్ ముగిసిన తర్వాత అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటించే వీలుంది.
ఉప సర్పంచ్ ఎన్నిక ఇలా..!
పోలింగ్ ముగిశాక మొదటగా వార్డు మెంబర్ల ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. అనంతరం సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఉప సర్పంచ్ ఎన్నికకు రిటర్నింగ్ అధికారి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. గెలిచిన వార్డు సభ్యులు, సర్పంచులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. అయితే సర్పంచ్ తో పాటు గెలిచిన వార్డు మెంబర్లు 50 శాతం హాజరైతేనే ఉప సర్పంచ్ ఎంపిక కంప్లీట్ కానుంది. ఒకవేళ ఆరోజు కుదరని పక్షంలో మరుసటి రోజు ఉప సర్పంచ్ ఎంపిక ప్రక్రియ పూర్తిచేయనున్నారు.