పంచాయతీ ఎన్నికల పంచాయితీ షురూ..! కొడంగల్ లో సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ డ్రామా..!!
కొడంగల్ / హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో జరగాల్సిన ఘట్టాలు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. అభ్యర్థుల అపహరణ, క్యాంప్ రాజకీయాలు, ప్రలోభాలు, ప్రభావితాలు అన్ని చోటుచేసుకోబోతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ తర్వాత ఈ అంశాలు వెలుగులోకి వచ్చే అవకావాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా లోకల్ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి విశ్వనాథ్ను బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న విశ్వనాథ్ను దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. నిటూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా విశ్వనాథ్ నేడు నామినేషన్ వేయాల్సి ఉంది. నామినేషన్ దాఖలుకు నేడు ఆఖరి రోజు కావడంతో ఆయన నామినేషన్ను అడ్డుకునేందుకే ప్రత్యర్థులు ఆయనను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కొడంగల్ లో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
తన నియోజవర్గంలో తన పార్టీ సర్పంచ్ అభ్యర్థి కిడ్నాప్ అయ్యారన్న సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హుటాహుటిన నిటూరు గ్రామానికి చేరుకున్నారు. విశ్వనాథ్ కుటుంబ సభ్యుల నుంచి సమాచారం తెలుసుకుని, కిడ్నాప్ వ్యవహారంపై ఎస్పీ అన్నపూర్ణకు ఫిర్యాదు చేశారు. రేవంత్ ఫిర్యాదుతో పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. .
నేడు నామినేషన్ వేయాల్సిన విశ్వనాథ్ 9 గంటలుగా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, మిత్రులు, పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. నిటూరు గ్రామంలో గతంలో పలు రాజకీయ హత్యలు జరిగిన సంఘటనలను గుర్తు చేస్తున్నారు గ్రామస్తులు. విశ్వనాథ్ను నామినేషన్ వేయకుండా ఆపేందుకే కిడ్నాప్ చేశారా? లేక ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అద్వర్యైంలో పోలీసులు విచారణ ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.