ఆసిఫాబాద్లో చిరుత కలకలం... జనావాసాల్లోకి దూరి పశువులపై దాడి... భయాందోళనలో ప్రజలు...
తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం(ఫిబ్రవరి 19) తెల్లవారుజామున 3గంటల సమయంలో పెంచికల్పేట్లోని ఓ ఇంటి ఆవరణలోకి పులి ప్రవేశించింది. అక్కడే కట్టేసి వున్న ఎద్దుపై దాడికి పాల్పడింది. దీంతో అది గట్టిగా అరవడంతో ఇంటి యజమాని పోశయ్య ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచాడు. తలుపులు తీసుకుని బయటకు వచ్చి చూడగా... ఇంటి ఆవరణలో పులి కనిపించింది. పులి తనవైపే దూసుకొస్తున్నట్లు కనిపించడంతో పోశయ్య గట్టిగా కేకలు వేశాడు. దీంతో పులి అటు నుంచి అటే అడవిలోకి పారిపోయింది.
తెలంగాణలోని కుమ్రంభీం,పెద్దపల్లి జిల్లాల్లో గత కొన్ని నెలలుగా చిరుతపులులు సంచరిస్తున్నాయి. దీంతో ఆ జిల్లాల్లోని గ్రామీణ ప్రజలు పొలం పనులకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. కుమ్రంభీం జిల్లాలో తప్పించుకు తిరుగుతున్న పులి ఇప్పటివరకూ 34 పశువులను బలితీసుకుంది. అటవీశాఖ అధికారులు దాన్ని బంధించేందుకు జనవరి 11 నుంచి జనవరి 18 వరకూ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఆ పులి ప్రాణహిత నదిని దాటి మహారాష్ట్ర వైపు వెళ్లడంతో ఆపరేషన్ ఆగింది.జనవరి 24 నుంచి మరో పులి సంచరిస్తున్నట్లు చెప్తున్నారు. పులి జనావాసాల్లోకి వస్తుండటంతో పెంచికల్పేట్,బెజ్జూర్,దహెగాం మండలాల్లోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇటు పెద్దపల్లి జిల్లాలోనూ కొన్ని నెలలుగా పులి సంచరిస్తున్న ఆనవాళ్లు బయటపడుతున్నాయి. పులి సంచారంతో ముత్తారం,ఓడేడు,మచ్చుపేట,అడవి శ్రీరాంపూర్,రామగిరి,వెన్నంపల్లి,బేగంపేట,లక్కారం,కాల్వ శ్రీరాంపూర్ మండలాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
చత్తీస్ఘడ్ అడవుల నుంచి గతేడాది జూన్లో ఒక పెద్దపులి భూపాలపల్లి జిల్లాలోప్రవేశించినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి చిట్యాల దగ్గర మానేరు నది దాటి పెద్దపల్లి జిల్లా ముత్తారం ఓడేడు గ్రామ శివారులోకి ప్రవేశించినట్లు గుర్తించారు. ఇదే క్రమంలో మచ్చుపేటకు చెందిన పశువుల కాపరి కార్కురి రాజయ్య ఆవుల మందపై పులి దాడి చేసింది. అయితే ఇప్పటివరకూ మళ్లీ ఆ పులి జాడ చిక్కలేదు.