రమ్య కుటుంబంలో మరో విషాదం: చికిత్స పొందుతూ తాత మృతి
హైదరాబాద్: పంజాగుట్ట రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చిన్నారి రమ్య కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. పంజాగుట్టలో జరిగిన రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న రమ్య తాత మధుసూదనాచారి సోమవారం ఉదయం మృతిచెందారు.
జులై 1 జరిగిన రోడ్డుప్రమాదంలో రమ్య బాబాయి అక్కడికక్కడే మృతిచెందగా.. పదిరోజుల పాటు పోరాడి కన్నుమూసింది రమ్య. మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమ్య తాతయ్య మధుసూదనాచారి పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు.
కాగా, తమ కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలను బలిగొన్న ఆరుగురు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రమ్య కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఆరుగురు నిందితుల్లో ఒకరినే అరెస్ట్ చేశారని అన్నారు. ప్రమాదానికి కారణమైన ఆరుగురు నిందితులతోపాటు వారి కుటుంబసభ్యులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరో కుటుంబంలో ఇలాంటి విషాదం చోటు చేసుకోకుండా సీఎం కెసిఆర్ తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు మధుసూదనాచారి మృతదేహాన్ని కదల్చేది లేదని రమ్య కుటుంసభ్యులు యశోదా ఆస్పత్రి వద్ద బైఠాయించారు.
ఆ తల్లికి గుండెకోత: కారుపై పడిన కారు, 9రోజులు మృత్యువుతో పోరాడి ఓడిన రమ్య
తాగి వాహనం నడిపితే తాట తీస్తారు!
డ్రంకెన్ డ్రైవింగ్పై తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. తాగి నడుపుతూ పట్టుబడితే, జరిమానా, శిక్షలతో పాటు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వానున్నారు. అదే చదువుకుంటున్న వారు పట్టుబడితే విద్యాసంస్థలకు, ఉద్యోగాలు చేస్తుంటే, వారు పనిచేసే సంస్థలకు సమాచారం అందిస్తారు.
పాస్ పోర్టులు జారీ చేసే కేంద్రాలకు, వీసాలను జారీ చేసే వివిధ దేశాల ఎంబసీలకూ సమాచారాన్ని పంపుతారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చూసే, టీఎస్ పీఎస్సీ, ప్రైవేటు ఉద్యోగ నియామక సంస్థలకు, వీరు తాగుబోతులని ముందే చెప్పేస్తారు.
జులై నెల ప్రారంభంలో పంజాగుట్టలో తీవ్ర ప్రమాదం జరగడం, ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడం నేపథ్యంలో సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి, తాగి వాహనాలు నడిపే వారికి అడ్డుకట్ట వేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.