అమెరికా చదువే కాదు, ఉద్యోగమూ కష్టమే: పాపిరెడ్డి, పునరావాస కేంద్రం కాదని ఘంటా
హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థులు చదువుకోవడంతో పాటు ఉద్యోగం చేయడం కూడా కష్టమేనని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. అమెరికా నుంచి విద్యార్తులను తిరిగి పంపించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాదులోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఆయన శనివారంనాడు డైరీతో పాటు స్టాటిస్టికల్ బుక్లెట్ను ఆవిష్కరించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆమోదంతో తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆయన చెప్పారు.
విశ్వవిద్యాలయాలకు వీసీల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతుందని చెప్పారు. ఈ ఏడాది ఉన్నత విద్యా మండలి ముందుకు సాగేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
పునరావాస కేంద్రం కాదు
తమ సంస్థ పునరావాస కేంద్రం కాదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్పిఎస్సీ) చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఖాలీలను తెలియజేస్తే వెంటనే భర్తీ చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ సూచన మేరకు డిఎస్సీ నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు.
ఫిబ్రవరి 4,5 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నిరుడు తాము 2 వేల ఖాళీలను భర్తీ చేయడానికి 9 నోటిఫికేషన్లు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. చక్రపాణి నేతృత్వంలోని టిఎస్పిఎస్సీ బృందం శనివారంనాడు గవర్నర్ నరసింహన్ను కలిసింది.