ఆడపిల్ల పుట్టిందని..! అమ్మే వద్దంటోంది..!
నాగర్ కర్నూల్ : ఆడపిల్ల పుట్టిందని ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం పేగుబంధానికి అర్థం లేకుండా చేసింది. రోజులు కూడా నిండని ఆ బిడ్డ తమకొద్దంటూ ఐసీడీఎస్ అధికారులను ఆశ్రయించారు. దీంతో చేసేదేమీ లేక ఆ పసిబిడ్డను శిశు సంరక్షణ గృహానికి చేర్చారు. మనసులను కదిలిస్తున్న ఈ ఘటన నాగార్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలో చోటుచేసుకుంది.
బాణాల గ్రామానికి చెందిన రమావత్ నిరంజన్ - దస్లి దంపతులకు నలుగురు ఆడపిల్లలు జన్మించారు. అందులో ఓ కూతురు అనారోగ్యం కారణంగా చనిపోయింది. అయితే వారసత్వం నిలిపేందుకు మగ సంతానం కావాలనుకున్నారు ఆ దంపతులు. ఆ క్రమంలో దస్లి మరోసారి గర్భం దాల్చడంతో శనివారం నాడు అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో అడ్మిట్ చేశారు కుటుంబ సభ్యులు. ఐదో కాన్పులోనూ ఆడపిల్ల జన్మించడం.. ఆ దంపతులకు నచ్చలేదు. దీంతో పసిబిడ్డ తమకు భారంగా మారుతుందని భావించి వదిలించుకోవాలని డిసైడయ్యారు.
ఆమేరకు అంగన్వాడీ టీచర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆమె వచ్చి దస్లి - నిరంజన్ కు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో.. పై అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో సూపర్వైజర్ విజయలక్ష్మి, ఇతర సిబ్బంది హాస్పిటల్ కు వచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా ఆ దంపతుల నిర్ణయంలో మార్పు రాలేదు. చివరకు ఆ పసిగుడ్డును మహబూబ్నగర్లోని శిశు సంరక్షణ గృహానికి తరలించారు.