తెలంగాణ ఎన్నికలు, దక్షిణాదిపై ప్లాన్: బీజేపీలో చేరిన స్వామి పరిపూర్ణానంద
న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద శుక్రవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన ఇంటిలో ఆయనకు సభ్యత్వం అందజేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ.. స్వామి సేవలను దక్షణ భారతదేశంలో వినియోగించుకుంటామని తెలిపారు.
బాబు గోగినేని వాళ్లకే ఆదర్శం, భావ ప్రకటన పేరుతో కించపరుస్తారా?: పరిపూర్ణానంద ఫైర్
ఆశతో కాదు.. ఆశయంతో..
తమకు ఆశీస్సులు అందజేసిన స్వామి తమతో కలిసి పని చేసేందుకు రావడం ఆనందంగా ఉందని అమిత్ అన్నారు. అనంతరం స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ.. నవరాత్రుల పాటు ఆత్మపరిశీలన చేసుకున్నాకే బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు. తాను ఆశతో పార్టీలో చేరలేదని.. ఆశయం కోసం చేరానని పరిపూర్ణానంద తెలిపారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, రాంమాధవ్ల మార్గదర్శకత్వంలో పని చేస్తానన్నారు. తెలంగాణలో పోటీ చేయడంపై నిర్ణయం పార్టీదేనని ఓ ప్రశ్నకు జవాబిస్తూ చెప్పారు.
అన్నీ ఆలోచించుకున్నాకే బీజేపీలోకి
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని దేశం అభివృద్ధి చెందుతోందని, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకే పార్టీలో చేరానని తెలిపారు. నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు పూర్తి నిరాహారంగా దీక్షలో ఉండి ఆత్మ పరిశీలన చేసుకున్నానని, తాను రాజకీయాలకు తగుతానా? పార్టీలో ఇమడ గలనా? పనిచేయగలనా? ఇలా అన్ని విషయాలను ఆలోచించుకున్నాకే బీజేపీలో చేరినట్టు స్వామి తెలిపారు.
దేశం, ధర్మం కోసం..
తన దీక్షకు విజయదశమితో పది రోజులు పూర్తయ్యాయని తరువాతనే బీజేపీలో చేరాలని నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. దేశం కోసం, ధర్మం కోసం ఏ సూత్రాలను, సిద్ధాంతాలను ఆరెస్సెస్ కొనసాగిస్తుందో, వాటిని రాజకీయ కోణంలో సమాజానికి మరింత దగ్గర చేసే విధంగా బీజేపీ కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్.. మహత్తర ఆలోచన
రాబోయే రోజుల్లో 29 రాష్ట్రాల్లో బీజేపీ కమలాన్ని వికసింపజేసే విధంగా ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్' అనే నినాదాన్ని ప్రతిఫలించే విధంగా ప్రధాని పని చేస్తున్నారని స్వామి పరిపూర్ణానంద చెప్పారు. గతంలో పార్టీలో చేరే అంశం పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్తో చర్చించినట్టు తెలిపారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో గత సమావేశంలో పలు అంశాలు చర్చించానని, ఈ దేశం ఉనికే ధర్మం, దాన్ని నిలబెట్టుకోవాలనేది మహత్తరమైన ఆలోచన అని అమిత్షా తనకు వివరించారని పరిపూర్ణానంద వెల్లడించారు. దీక్ష అనంతరం విజయదశమి రోజున వస్తానని అమిత్షాకు తెలిపానని స్వామి తెలిపారు.
ఊపిరి ఉన్నత వరకు..
అమిత్షా, రామ్మాధవ్ అనుభవాలను కూడగట్టుకొని దేశానికి, ధర్మ పరిరక్షణకు తన ఊపిరి ఉన్నంత వరకు పని చేస్తానని ఆయన ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు తనను గుండెల్లో పెట్టుకున్నారని, తమ గురువు తనకు పరిపూర్ణానంద స్వామి అని పేరు పెడితే తెలుగు ప్రజలు తనకు పరిపూర్ణత ఇచ్చారని వెల్లడించారు. తెలుగు ప్రజలు తనకు ఇచ్చిన స్థానం పదవి కంటే గొప్పదని వెల్లడించారు. అ స్థానం మహత్తరమైనదని, ప్రజల కోరికలను నెరవేరుస్తానని, తన భగవద్గీతను ఆపనని, తన సాధన ఆపుకోనని ఆయన స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో ఉన్నాను గనుక సాధనను మరింత కఠినతరం చేసుకోవాలని పరిపూర్ణానంద తెలిపారు.
తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది కోసం స్వామి..
బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి రావాలని స్వామి పరిపూర్ణానందను తాము కోరామని బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ పేర్కొన్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీని పటిష్టం చేసేందుకు ఒక కార్యకర్తలాగా స్వామి పని చేస్తారన్నా ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా బీజేపీ బలోపేతానికి స్వామి కృషి చేస్తారని రామ్మాధవ్ వెల్లడించారు. స్వామి చేరికతో బీజేపీ మరింత బలపడిందని అన్నారు.