పరిపూర్ణానంద హౌస్ అరెస్ట్పై బీజేపీ ఆగ్రహం: తరలివచ్చిన హిందూ సంఘాలు
Recommended Video
హైదరాబాద్: రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి చేపట్టిన ధర్మాగ్రహ యాత్రకు హైదరాబాద్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో పాటు, జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు బయటకు వచ్చేందుకు అనుమతించలేదు.
'శ్రీరాముడి' దెబ్బ, మహేష్ కత్తి ఖేల్ ఖతమ్!
భద్రతను కట్టుదిట్టం చేయడంతో స్వామిజీ ఇంటికే పరిమితమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పరిపూర్ణానంద భక్తులు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలుఆయన నివాసానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు, ఇతరులు అడ్డుకున్నారు. భావప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వ్యక్తులను కాదని, ప్రజాస్వామ్యబద్ధంగా యాత్ర చేసే వారిని అడ్డుకోవడమేమిటని ప్రశ్నించారు. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
పరిపూర్ణానందను అడ్డుకోవడాన్ని ఖండించిన లక్ష్మణ్
పాదయాత్రలు, నిరసనలు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, పరిపూర్ణానంద స్వామిని హౌస్ అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. హిందువులను, హిందూమతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే ప్రభుత్వం తేలిగ్గా తీసుకోవడం సరికాదన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహేష్ కత్తి వంటి వారు అంతటి మాటలు మాట్లాడితే ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరించడం ఏమిటన్నారు. పరిపూర్ణానందను బేషరతుగా గృహ నిర్బంధం నుంచి విడుదల చేయాలన్నారు.
పరిపూర్ణానంద యాత్ర రెచ్చగొట్టడానికి కాదు
స్వామి పరిపూర్ణానందను గృహ నిర్బంధం చేయడం సరికాదని స్వామి గణేశానంద భారతి అన్నారు. పరిపూర్ణానంద తలపెట్టిన ధర్మాగ్రహ యాత్ర ఎవరినో రెచ్చగొట్టడానికో లేక ప్రతీకారచర్యకో కాదన్నారు. ఈ యాత్రను అడ్డుకోవడం సరికాదని, దానిని ఇంతగా రాద్ధాంతం చేసి గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకోవడం మంచిది కాదన్నారు. పరిపూర్ణానందను వెళ్లనిస్తే ఇప్పటికే ఘట్కేసర్ దాటి ఆయన యాత్ర కొనసాగేదన్నారు. పరిపూర్ణానంద యాత్ర సజావుగా ముందుకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్నారు.