అదే భాషలో చెబుతాం, వారికి అమ్ముడుపోతే వారితో బతుకు: కమల్కు పరిపూర్ణానంద హెచ్చరిక
నటుడు కమల్ హాసన్పై శ్రీపీఠం మఠాధిపతి, రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో మీడియా సమావేశంలో మాట్లాడారు. కమల్ ఓ దేశద్రోహి అన్నారు.
హైదరాబాద్: నటుడు కమల్ హాసన్పై శ్రీపీఠం మఠాధిపతి, రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో మీడియా సమావేశంలో మాట్లాడారు. కమల్ ఓ దేశద్రోహి అన్నారు.
ఎన్టీఆర్ నుంచి బుద్ధితెచ్చుకో, నువ్వు తగ్గకుంటే:కమల్హాసన్కు పరిపూర్ణానంద హెచ్చరిక, సంచలన వ్యాఖ్యలు
ఆయన ఓ లోకల్ నాయకుడు కూడా కాదన్నారు. ప్రేక్షకాదరణ లేకపోవడం వల్లే రాజకీయాల్లోకి వస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎక్కడైనా ఓ హిందూ తీవ్రవాదిని చూపించండి అని హిందుత్వవాదులు సవాల్ విసరలేరని, ఆ స్థాయిలో వారిలో తీవ్రవాదం వ్యాపించిందని కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు మండిపడుతున్నారు.
కమల్ హాసన్ ఉపసంహరించుకోవాల్సిందే, ఊరుకోం
కమల్ హాసన్పై పరిపూర్ణానంద ఇటీవలే ఓ వీడియోలో నిప్పులు చెరిగారు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు. కమల్ మాత్రమే కాదని, ఆయనను ప్రేరేపిస్తున్న వారంతా దేశద్రోహులే అన్నారు. కమల్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
ఏ భాష వాడితో అర్థమవుతుందో అదే భాషలో చెప్తాం
వారికి ఏ భాషవాడితే అర్థమవుతుందో అదే భాషలో చెబుతామని పరిపూర్ణానంద అన్నారు. కమల్ హాసన్ కమాల్ హుస్సేన్గా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఆయన వెనుక ఎవరున్నారో తేలాల్సి ఉందన్నారు. ఆయనకు హిందూ ధర్మం ఏం ద్రోహం చేసిందని, అతివాదం ఎక్కడ కనిపించిందో చెప్పాలని నిలదీశారు.
కమల్ హాసన్ను మళ్లీ హెచ్చరిస్తున్నాం
ఇతర మతాల్లో అతివాదం లేదా అని పరిపూర్ణానంద నిలదీశారు. కమల్ హాసన్ వెనుక ఎవరున్నారనే విషయాన్ని కేంద్రం గుర్తించాలన్నారు. ఈ మేరకు తాము కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. కమల్ వంటి వారిని తాము మరోసారి హెచ్చరిస్తున్నామన్నారు.
ఇతరులకు అమ్ముడుపోతే వారితోనే బతుకు
హిందుత్వం, హిందూ ధర్మం మీద నమ్మకం ఉంటే హిందువులతో సఖ్యతతో ఉండాలని, ఒకవేళ ఇతరులకు అమ్ముడుపోతే వారితోనే బతకాలని పరిపూర్ణానంద అన్నారు. హిందూధర్మం, హిందూ పద్ధతుల మీద మాట్లాడితే మాత్రం సహించబోమన్నారు. ఎవరికి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెబుతామన్నారు. వారికి అర్థమయ్యే భాషలోనే బుద్ధి చెబుతామన్నారు.
భగవద్గీత చదువుతాం, రెండూ తెలుసు
తాము భగవద్గీతను చదువుకున్నామని, సహనంగా ఎలా ఉండాలో తెలుసని, అలాగే సహనం కోల్పోతే ఏం చేయాలో కూడా తెలుసని పరిపూర్ణానంద అన్నారు. కమల హాసన్ జాతీయ గీతాలాపనను కూడా హేళన చేశారన్నారు. కమల్ లాంటి వారు చేస్తోన్న వ్యాఖ్యలను ప్రతి మారుమూల ప్రాంతానికి తీసుకెళతామన్నారు. ఇటువంటి మాటలు మాట్లాడేవారికి బుద్ధి చెబుతామన్నారు. హిందూత్వంపై ఇటువంటి వ్యాఖ్యలు చేసేవారు ఎవ్వరైనా సరే దేశ ద్రోహులే అన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ధర్మం కోసం నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ ధర్మం, దేశం మనది అని యువత ఉత్సాహంతో ఉరకలు వేస్తోందన్నారు.