సన్యాసి అంటే హిందుత్వం కాదు!: గోహత్య - 'అసహనం'కు లింక్
హైదరాబాద్: సన్యాసి అంటే హిందుత్వం గురించి చెప్పేవారు కాదని, మానవాళి క్షేమాన్ని కోరుకునే వారని శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి గురువారం అన్నారు. కులం, మతం, ప్రాంతం అన్నీ వదులుకునే వాడే సన్యాసి అని చెప్పారు. సన్యాసి ప్రపంచశాంతిని కాంక్షిస్తారన్నారు.
గోవు ఓ మతానికి చెందినదిగా ఎవరూ భావించవద్దని హితవు పలికారు. గోవుతో ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. గోవు పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు అన్నారు. చాలామంది రోజుకు రూపాయల కొద్ది మందులు మింగుతున్నారని, కానీ రోజు గోవు పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు అన్నారు.
గోవు పాలు తాగవచ్చు, పెరుగు, నెయ్యి తినవచ్చు, మలమూత్రాలు పాడి పంటలకు వాడుకొనవచ్చు, కానీ చంపేయవద్దన్నారు. తల్లి పాలకు ప్రత్యామ్నాయం గోవు పాలు అన్నారు. గణపతి కంటే ముందే మనం గోవును పూజిస్తామన్నారు.
పూజించకున్నా గౌరవించండి
గోవును వంద కోట్ల మంది హిందువులు పూజిస్తారని, వ్యతిరేకించే వారు కనీసం పూజించకపోయినా గౌరవిస్తే చాలన్నారు. హిందువులు పూజించే గోవును చంపడం అంటే వారిని బాధించినట్లే అన్నారు. ఎవరి ఆహార పద్ధతులు వారివని, తాము దానిని వ్యతిరేకించడం లేదన్నారు.
గోవుపై చేయి వేస్తేనే అసహనం
గోమాత పైన చేయి వేస్తేనే హిందువులకు అసహనం కలుగుతోందని పరిపూర్ణానంద చెప్పారు. వంద కోట్ల మంది హిందువులు గోమాతను పూజిస్తారని చెప్పారు. అలాంటి గోమాత పైన చేయి వేయడమే అసహనానికి నిదర్శనం అన్నారు. బీఫ్ నుంచి గోవును తీసేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరు ఎలాంటి ఆహారమైన తినవచ్చున్నారు.
అన్నీ ఇచ్చే గోమాత పైనే ఎందుకు
అమెరికాలోని డల్లాస్ నగరంలో గుర్రాలను వధించే ఓ పరిశ్రమ ఉండేదని, పెట్ ఎనిమల్ అయిన దానిని చంపవద్దని స్థానికులు ఆందోళన చేశారని, దీంతో ఆ పరిశ్రమను మూసేశారని చెప్పారు. మరో దేశంలోను కుక్కను తింటారని, అక్కడ ఉద్యమాలు వస్తున్నాయన్నారు.
కానీ, మనకు ఎన్నో ఇచ్చే గోమాత విషయంలో మాత్రం ఆ ఉదారత ఎందుకు చూపలేకపోతున్నారని నిలదీశారు. గోమాత వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పారు. వ్యవసాయానికి ఉపయోగపడుతుందని, కరువు వచ్చినప్పుడు ఆవు పాడితో కుటుంబాలు బతకవచ్చునని చెప్పారు.
ఇప్పుడు వస్తున్న రసాయన మందుల కంటే ఆవు మలమూత్రాలు పంట పొలాలకు చాలా మంచివని చెప్పారు. ఆవు పాలు తాగితే ఆరోగ్యమని, ఆవు మాంసం తింటే అనారోగ్యం అని చెప్పారు. దేశంలోని 24 రాష్ట్రాల్లో గోవధ నిషేధించారని, దీంతో గోవధ నిషేధించని మిగతా 5 రాష్ట్రాలకు గోవులను తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గోఆధారిత వ్యవసాయంతో రైతు ఆత్మహత్యలు నివారించవచ్చునని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో గో రక్ష క్రాంతి పథకం కింద రైతులకు ఆవులను పంపిణీ చేయాలని కోరారు. ఆవును పశువుగా చూడవద్దని కోరారు. గోమాతగా చూడాలన్నారు.
గుడ్డు తింటే మంచిదని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని, ఆవు పాలు తాగితే చాలాచాలా మంచిదని విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. గోవధ అనే మాట పలకడమే పెద్ద నేరం అన్నారు. ఇప్పటికైనా చట్టాలను గౌరవించాలని, కఠినంగా అమలు చేయాలన్నారు.
గోరక్షా దివస్
ఇక నుంచి డిసెంబర్ 10న గో రక్షా దివస్ నిర్వహించాలని పరిపూర్ణానంద పిలుపునిచ్చారు. ఏపీలో ప్రభుత్వం గోరక్షా దివస్ను నిర్వహిస్తోందని, తెలంగాణలోను అలాగే నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగం ప్రకారం గోవధ నేరం అన్నారు. గోవును వధిస్తే ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని చెప్పారు.
'దళితులు'పై చర్చ జరగాలి
ప్రతి విషయానికి దళితులు అంటూ వారిని అవమానించవద్దని పరిపూర్ణానంద అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం రచించారని, ఆ తర్వాత నారాయణన్ రాష్ట్రపతి అయ్యారని, మీరా కుమార్, బాలయోగిలు స్పీకర్లు అయ్యారని గుర్తు చేశారు. దళితులు అనే మాట పైన చర్చ జరగాలన్నారు.